వరంగల్ నిట్లో ఖరీదైన డ్రగ్స్ కలకలం: పట్టుబడ్డ ఇద్దరు విద్యార్థులు
ఇటీవల డ్రగ్స్ వ్యవహారం రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది.
వరంగల్: ఇటీవల డ్రగ్స్ వ్యవహారం రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. తాజాగా వరంగల్ జిల్లాలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యాసంస్థ నిట్లో బుధవారం డ్రగ్స్ కలకలం సృష్టించాయి.
డ్రగ్స్ తీసుకుంటూ ఇద్దరు విద్యార్థులు ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో నిట్ వసతి గృహంలో అధికారులు సోదాలు చేపట్టారు. ఇద్దరు విద్యార్థుల నుంచి అత్యంత ఖరీదైన ఎల్ఎస్డీ మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. వారు ఈ డ్రగ్స్ను డార్క్ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిట్ క్యాంపస్లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, డ్రగ్స్ కేసులో అరెస్టయిన కీలక ముఠా సభ్యుల విచారణ ఓ వైపు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే నిట్లో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.
అంతేగాక, అధికారులు డ్రగ్స్ వాడకంపై తీవ్ర హెచ్చరికలు చేస్తున్నప్పటికీ డ్రగ్స్ వ్యవహారం ఎక్కడో ఓ చోట జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డ్రగ్స్ కేసులో 12మంది సినీ ప్రముఖులను కూడా విచారించిన విషయం తెలిసిందే. కాగా, డ్రగ్స్ కేసులో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని మంగళవారం ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు.