బ్రీత్ అనలైజర్ టెస్ట్లో తప్పులా? హైద్రాబాద్లో పోలీసులకు రివర్స్: ఏం జరిగింది?
Recommended Video
హైదరాబాద్: బ్రీత్ అనలైజర్లో తప్పువల్ల తన పరువు పోయిందని ఓ యువకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాను మద్యం తాగలేదని, కానీ ఈ టెస్టులో మందు తాగినట్లు చూపించిందని, దీంతో పోలీసులు కేసు బుక్ చేశారని చెప్పారు. హైదరాబాదులోని కింగ్ కోఠికి చెందిన జహీర్ బైక్ పైన వస్తున్నాడు.
పోలీసులు అతనిని ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. మద్యం సేవించినట్లు 43 పాయింట్లు నమోదయింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అతనిని వైద్య చికిత్సల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
బ్రీత్ అనలైజర్లో తప్పులు ఉన్నాయని కేసు
జహీర్ మద్యం సేవించినట్లు బ్రీత్ అనలైజర్ టెస్టులో తేలింది. అయితే ఉస్మానియా వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో అతడి శరీరంలో ఎలాంటి ఆల్కహాల్ ఆనవాళ్లు కనిపించలేదు. దీనికి సంబంధించి డాక్టర్లు అధికారికంగా ధ్రవీకరించారు. దీంతో బాధితుడు పోలీసుల మీద ఆఘ్రహం వ్యక్తం చేశాడు. తాను మద్యం తాగలేదని చెప్పినా వినలేదన్నాడు. అతను ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన సర్టిఫికేట్తో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బ్రీత్ అనలైజర్లో తప్పులు ఉన్నాయని చెప్పాడు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది.
కీలక మలుపులు తిరుగుతున్న కేసు
దీనిపై ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ.. ఉస్మానియా డాక్టర్లు రక్త పరీక్ష చేయలేదని చెప్పారు. ఈ మేరకు ఉస్మానియా సూపరింటెండెండ్కు లేఖ కూడా రాశారు. బ్రీత్ అనలైజర్లో తప్పులు ఉన్నాయని ఆయన ఫిర్యాదు చేయడం, పోలీసులు ఉస్మానియా వైద్యులకు లేఖ రాయంతో ఇది మలుపులు తిరుగుతోంది.
లేఖ రాశామని పోలీసులు
డాక్టర్ల నివేదికపై విచారణ జరిపించాలని లేఖ రాశామని, బ్రీత్ అనలైజర్ పైన అనుమానాలు వద్దని, వాహనదారుడిని పరీక్షించిన సమయంలో 43 పాయింట్లు ఉందని చూపడంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లు మద్యం తాగలేదని నిర్ధారించడంపై విచారణ జరిపించాలని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్కు లేఖ రాశామని, ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.
బ్రీత్ అనలైజర్ ఇబ్బంది
సాధారణంగా ట్రాఫిక్ సిబ్బంది బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్ష నిర్వహిస్తే బీఏసీ 35 శాతం దాటితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. వైద్యులు కళ్లు, గొంతు, వాసన, నడకను పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. ఈ పరీక్షల్లో 40 శాతం లోపు బీఏసీ ఉన్నవారిని గుర్తించడం కష్టమని అంటున్నారు. 40 శాతం దాటితే గుర్తించే అవకాశాలుంటాయి. అయితే జహీర్ విషయంలో 43 శాతం వాస్తవమే అయినప్పటికీ ఆసుపత్రికి వెళ్లేసమయానికి తీవ్రత తగ్గే అవకాశముందని అంటున్నారు. ఏవైనా టాబ్లెట్స్ వాడినా తీవ్రత తగ్గుతుందని అంటున్నారు.