సీఐ డ్రంక్ అండ్ డ్రైవ్: కారు ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్రగాయాలు
హైదరాబాద్: ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసు విభాగంలో పనిచేస్తూ అందుకు భిన్నంగా వ్యవహరించారు ఓ సీఐ. మద్యం మత్తులో కారు నడిపిన ఆయన.. పలువురిని తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన నగరంలోని యాప్రాల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయనకు కూడా తీవ్రగాయాలయ్యాయి.
హైదరాబాద్ రేంజ్లో సీఐగా పనిచేస్తున్న గిరీశ్రావు మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి గురయ్యారు. కైకూరు రోడ్డు మీదుగా యాప్రాల్ శైలి గార్డెన్లోని తన నివాసానికి వెళ్తుండగా యాప్రాల్ సమీపంలోని మిలటరీ ఏరియాలోని హనుమాన్ దేవాలయం వద్ద కారు అదుపు తప్పింది.
ఎదురుగా వస్తున్న మూడు ద్విచక్రవాహనాలు, ఓ ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సీఐ సహా ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరు దంపతులకు కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై నరసింహులు పరిశీలించారు.
సీఐ గిరీష్ కుమార్ మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణం కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తీవ్రంగా స్పందించారు. సీఐ గిరీష్కుమార్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. సీఐ గిరీశ్ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.