నీ భార్య ఎందుకు రాలేదు?: ఈ ప్రశ్నే ఆ ముగ్గురు నిందితులను పట్టించింది..
హైదరాబాద్: తాగి వాహనం నడిపి అడ్డంగా దొరికిపోయిన ఓ వ్యక్తి అతి తెలివితేటలు ప్రదర్శించాడు. ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని తన స్థానంలో మరో వ్యక్తిని కౌన్సెలింగ్కు పంపించాడు. అయితే పోలీసుల విచారణలో మరోసారి అడ్డంగా దొరికిపోక తప్పలేదు.
వివరాల్లోకి వెళ్తే.. వెంకటగిరికి చెందిన మనోహర్ మద్యం తాగి వాహనం నడుపుతూ ఇటీవల రెండుసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. కృష్ణానగర్, బంజారాహిల్స్ రోడ్ నం.36లలో డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో చిక్కాడు. దీంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అతనిపై కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం కుటుంబ సభ్యులను తీసుకుని సోమవారం బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ కు రావాలని సమాచారం అందించారు. కౌన్సెలింగ్ గురించి ఇంట్లో చెప్తే పరువు పోతుందని భయపడిన మనోహర్.. తన బదులు తన మిత్రుడైన లాజర్ను కౌన్సెలింగ్కు పంపాడు.
అలాగే కొండాపూర్కు చెందిన శివకుమార్ను తన తండ్రిగా అక్కడికి పంపించాడు. ఈ సందర్భంగా మనోహర్ గత కేసులకు సంబంధించిన ఫైల్స్ చూడగా.. డ్రంకన్ డ్రైవ్ కేసులో ఓసారి తన భార్యతో కలిసి కౌన్సెలింగ్ కు వచ్చినట్టు నిర్దారించుకున్నారు. దీంతో మనోహర్ స్థానంలో అక్కడికి వచ్చిన వ్యక్తిని నీ భార్య ఏదని ప్రశ్నించారు. మనోహర్కు పెళ్లయిందన్న విషయం తెలియని లాజరస్.. తనకింకా పెళ్లి కాలేదన్నాడు.
మనోహర్ తండ్రిగా వచ్చిన శివకుమార్ను కూడా అదే అడిగారు. మీ కోడలెందుకు రాలేదని ప్రశ్నించగా.. మావాడికి ఇంకా పెళ్లి కాలేదని చెప్పాడు. దానికి తోడు వేలిముద్రలు కూడా సరిపోకపోవడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
మనోహర్ బదులు వేరొకరు కౌన్సెలింగ్కు వచ్చారని నిర్దారించుకుని.. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై మనోహర్ ను కూడా అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు.