'డ్రంకన్ డ్రైవ్'కి మరో నిండు ప్రాణం బలి: మద్యం మత్తులో యువతి దారుణం..
హైదరాబాద్: మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువతి ఓ యువకుడి ప్రాణాలు బలిగొన్నది. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి అర్థరాత్రి సమయంలో గచ్చిబౌలి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మృతుడు చిరంజీవిగా గుర్తింపు..:
బోరబండలో నివాసముండే చిరంజీవి(20) గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం శనివారం రాత్రి స్నేహితుడు సాయికుమార్(20)తో కలిసి బైక్ పై గచ్చిబౌలి నుంచి మాదాపూర్ బయలుదేరాడు.
టీ-హబ్ సెకండ్ ఫేజ్ వద్ద:
మాదాపూర్ వెళ్తున్న క్రమంలో.. చిరంజీవి బైక్ టీ-హబ్ సెకండ్ ఫేజ్ వద్దకు రాగానే అతివేగంతో వచ్చిన ఓ కారు వీరిని ఢీకొట్టింది. దీంతో కిందపడిపోయిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికి చిరంజీవి మృతి చెందారు.
సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉంది. చిరంజీవి మృతి విషయం తెలిసిన బంధువులు, స్నేహితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వాళ్లు సేఫ్:
ప్రమాదానికి కారణమైన యువతిని సీఏ స్టూడెంట్ జాకబ్(26)గా గుర్తించారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా నిర్దారించారు. ఆ సమయంలో జాకబ్ తో పాటు ఆమె స్నేహితురాలు లీజా(26) కారులో ఉందని పోలీసులు తెలిపారు. సమయానికి కారులోని బెలూన్స్ తెరుచుకోవడంతో.. వీరిద్దరు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు.
మద్యం సీసాలు.. చికెన్ ముక్కలు:
ప్రమాద సమయంలో.. బైక్ ను ఢీకొట్టాక కారు పల్టీలు కొట్టినట్టు పోలీసులు చెప్పారు. దీంతో కారు చాలావరకు దెబ్బతిన్నదని తెలిపారు. ఆ కారును ఓ ప్రముఖ సంస్థ నుంచి అద్దెకు తీసుకున్నట్టు గుర్తించారు. కారులో మద్యం సీసాలతో పాటు చికెన్ ముక్కలు ఉన్నట్టు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన జెన్నీని ఢిల్లీకి చెందిన యువతిగా గుర్తించారు.