మద్యం మత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్: బీటెక్ విద్యార్థి మృతి, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్: మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన తన స్నేహితుడి ప్రాణాలు తీశాడు ఓ యువకుడు. మరో ముగ్గురికి ఈ ఘటనలో గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ లుంబినీ స్ప్రింగ్స్ విల్లాస్లో నివసించే ముదునూరి సాయి జతిన్ వర్మ (21) గీతం కాలేజ్లో బీటెక్ చదువుతున్నాడు. అతడి స్నేహితుడు సాయి కార్తీక్.. సత్యభామ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నాడు.
పార్టీకి వెళ్లి..
కాగా, జతిన్, కార్తీక్తో పాటు జూబ్లీహిల్స్లో నివాసం ఉండే ఎం.రోహన్, నిఖిల్ శనివారం రాత్రి కార్తీక్కు చెందిన ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు(ఏపీ09సీవీ5256)లో బంజారాహిల్స్ రోడ్ నం.2లోని పార్క్ హయత్ హోటల్లో స్నేహితుడి సోదరికి సంబంధించిన ఓ పార్టీలో పాల్గొన్నారు. అక్కడ మద్యం తాగిన వీరు రాత్రి 12.30 గంటల ప్రాంతంలో తిరుగు పయనమయ్యారు. కార్తీక్ కారు డ్రైవ్ చేస్తుండగా.. పక్క సీటులో జతిన్, వెనుక రోహన్, నిఖిల్ కూర్చున్నారు. జతిన్ను గచ్చిబౌలిలో దింపి రావడానికి వెళ్తున్న వీరి వాహనం జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వైపు మళ్లింది.
మితిమీరిన వేగం
మితిమీరిన వేగంతో వాహనం నడుపుతున్న కార్తీక్ దాన్ని అదుపు చేయలేకపోయాడు. తెలంగాణ రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ కార్యాలయం ముందుకు వచ్చేసరికి కారు పూర్తిగా అదుపు తప్పి... రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న స్కోడా కారు(ఏపీ13ఏజీ0333)ను బలంగా ఢీ కొట్టింది.
మితిమీరిన వేగంఅక్కడికక్కడే జతిన్..
దాదాపు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఎకో స్పోర్ట్ వాహనం ఈ దాటికి గాల్లోకి లేచి మూడు పల్టీలు కొట్టి ఫుట్పాత్పై పడింది. దీంతో జతిన్ కూర్చున్న వాహనం ఎడమవైపు భాగం ఫుట్పాత్కు బలంగా తగిలింది. తలపగిలిన జతిన్ అక్కడికక్కడే కన్నుమూశాడు.
కౌంట్ 80
వెనుక కూర్చున్న నిఖిల్కు తీవ్రగాయాలు కాగా, మిగిలిన ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని పోలీసులు అపోలో ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన కార్తీక్కు పోలీసులు బ్రీత్ అనలైజర్తో చేసిన టెస్ట్లో అతడు మద్యం సేవించినట్లు, బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 80 వచ్చినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు కార్తీక్పై ఐపీసీలోని 304(ఏ), 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఆ కారుపై మితిమీరిన వేగం కేసులు నమోదవడం గమనార్హం.