జూబ్లీహిల్స్లో యువతి రచ్చ: తప్పతాగి అందరిని హడలెత్తించి..
కొంతమంది వాహనాదారుల సహాయంతో బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్ సమీపంలో పోలీసులు యువతిని అదుపులోకి తీసుకోగలిగారు.
జూబ్లీహిల్స్: తప్ప తాగింది.. పోలీసులకు ఎక్కడ దొరికిపోతానన్న భయంతో కారు స్పీడు పెంచింది. రెండు వాహనాలను ఢీ కొట్టింది. రోడ్డు వెంబడి మిగతా వాహనాదారులను హడలెత్తించింది. చివరికి మాత్రం పోలీసుల చేతికి చిక్కక తప్పలేదు.
వివరాల్లోకి వెళ్తే.. సోమాజీగూడకు చెందిన ఓ యువతి(21) బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీబీఏ చదువుతుంది. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్లో ఓ పార్టీకి వెళ్లి పీకలదాకా మద్యం సేవించింది. అనంతరం స్నేహితురాలితో కలిసి వెనుదిరిగింది.
ఇదే క్రమంలో పోలీసులు డ్రంకన్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తుండటం కంటపడటంతో.. ఎలాగైనా తప్పించుకోవాలని కారు స్పీడు పెంచింది. అతివేగంతో ఓ ఓ క్యాబ్ను , బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్పీడుగా కారును పరుగులు పెట్టించడంతో రోడ్డు వెంబడి మిగతా వాహనాదారులు హడలిపోయారు.
కొంతమంది వాహనాదారుల సహాయంతో బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్ సమీపంలో పోలీసులు యువతిని అదుపులోకి తీసుకోగలిగారు. అప్పటికీ పోలీసుల మీదే దుర్భాషాలడుతూ నానా రచ్చ చేసినట్టు సమాచారం. పరీక్షల్లో యువతి అతిగా మద్యం సేవించినట్టు తేలింది.
ఐపీసీ సెక్షన్ 279, 185ల కింద యువతిపై కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కారును స్వాధీనం చేసుకుని యువతి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.