ప్రభుత్వ సలహాదారుగా డిఎస్, కేబినెట్ హోదా: ఫోన్ చేసి చెప్పిన కెసిఆర్
హైదరాబాద్: నెల పదిహేను రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదవిని కట్టబెట్టారు. ఆయనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ శుక్రవారం నాడు జీవో జారీ అయింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సలహాదారుగా ఆయనను నియమించడంతో కేబినెట్ హోదా కల్పిస్తూ కూడా జీవో జారీ చేసింది. అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో ఆయనను ప్రత్యేక సలహాదారుగా నియమించారు.ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయమై డిఎస్కు ఫోన్ చేసి చెప్పారు.
డి శ్రీనివాస్ జూలై 8వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలోనే డిఎస్కు పదవి పైన కెసిఆర్ హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాను బంగారు తెలంగాణ కోసం కారు ఎక్కుతున్నానని, తనకు పదవులు లెక్కకాదని డిఎస్ చెప్పారు.
కెసిఆర్కు సహకరిస్తా: డిఎస్
తన పైన నమ్మకంతో కెసిఆర్ తనకు బాధ్యతలు అప్పగించారని డిఎస్ అన్నారు. అంతర్ రాష్ట్రాల సమస్య పరిష్కారానికి కెసిఆర్కు తాను తోడుగా ఉంటానని చెప్పారు. బంగారు తెలంగాణ సాధన కోసం తాను తెరాసలో చేరానని చెప్పారు. అందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.
ఔట్లుక్పై 10కోట్లకు పరువు నష్టం దావా
తన గురించి అభ్యంతరకర వార్తాకథనం, కార్టూన్ను ప్రచురించినందుకు ఔట్ లుక్ పత్రిక యాజమాన్యంపై రూ.పది కోట్లకు పరువు నష్టం దావా వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ నిర్ణయించారు.
ఈ కేసు ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం స్మితా సబర్వాల్కు 15 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రూ.పది కోట్ల పరువు నష్టం దావా వేసేందుకు అనుమతిని కోరుతూ గత నెల 29న స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ కేసు వేయడానికి అవసరం అయ్యే వ్యయం కోసం రూ.15 లక్షలు మంజూరు చేసింది. రూ.పది కోట్ల పరువు నష్టం దావా వేసేందుకు నిబంధనల మేరకు హైకోర్టులో తొమ్మిది లక్షల 75 వేల రూపాయలు డిపాజిట్ చేయాలి.
దీనితో పాటు కేసు వేయడానికి అయ్యే ఐదు లక్షల వ్యయం మొత్తం 15లక్షలు మంజూరు చేశారు. రూ.పది కోట్ల రూపాయల పరువు నష్టం కేసులో ఔట్ లుక్ యాజమాన్యంపై విజయం సాధిస్తే, నిధులను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.