హరీష్ రావే పిలిచారు, 4-5రోజులు చూస్తా, ముందస్తుకు అవకాశం: డీఎస్
నిజామాబాద్: తెరాసలో చేరాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తన వెంట పడ్డారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు డీ శ్రీనివాస్ మంగళవారం చెప్పారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూచన మేరకే ఆయన తనను అడిగి ఉంటారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామని, ఆ విశ్వాసంతోనే పార్టీలోకి వస్తానని ఆయనకు చెప్పానని అన్నారు.
తాను పార్టీలో కోరింది రాజ్యసభ పదవి కాదని, గుర్తింపు కోరుకున్నానని చెప్పారు. తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు అందరూ ఆగమేఘాలపై తీర్మానం చేసి ముఖ్యమంత్రికి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై చర్యలు తీసుకోవాలని వారు చెప్పి ఇన్ని రోజులు అయినా కేసీఆర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవం అన్నారు. తాను తప్పు చేశానని నమ్మితే చర్యలు తీసుకోవాలని, లేదా తీర్మానం వెనక్కి తీసుకోవాల్సిందే అన్నారు.
తాను నాలుగైదు రోజులు కేసీఆర్ స్పందన కోసం వేచి చూస్తానని, అప్పటికీ చెప్పకుంటే తన నిర్ణయం తాను తీసుకుంటానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై ఆలోచిస్తున్నానని తెలిపారు. తనకు, తన కార్యకర్తలకు గౌరవం ఇచ్చే పార్టీలో చేరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆ పార్టీని ఎన్నడూ విమర్శించలేదన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.