దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.!త్రిముఖ పోటీ తప్పదంటున్న విశ్లేషకులు.!
సిద్దిపేట/హైదరాబాద్ : మంగళవారం జరుగనున్న దుబ్బాక ఉప ఎన్నికకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. దుబ్బాకలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు సంబంధిత ఉద్యోగులు చేరుకుంటున్నారు. మండలాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల సమాగ్రిని ఉద్యోగులకు అందిస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు 6న మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమయ్యింది. అక్టోబర్ 9న ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈనెల 3న మంగళవారం రోజున పోలింగ్ జరుగనుంది. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపాలిటీ, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాలతో పాటు మెదక్ జిల్లాలోని చేగుంట, నార్సింగ్ మండలాలున్న అంశం తెలిసిందే.
ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు మొత్తం 23మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 'నోటా'తో కలుపుకొని మొత్తం 24 గుర్తులుంటాయి. ఒక్కో బూత్లో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, ఈనెల 10న సిద్దిపేట ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో కౌటింగ్ నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున దివంగత రామలింగారెడ్డి సతీమణి సుజాత పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. 20 రోజులపాటు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచార హోరు కొనసాగింది.
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరుఫున ఆర్థ్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నీ తానై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఐనప్పటికి దుబ్బాక ఉప పోరులో త్రిముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.