దుబ్బాక బై పోల్ ఫలితం హరీశ్ రావు భవితవ్యంపై ఆధారపడి ఉంది..జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
దుబ్బాక బై పోల్ ప్రచారం హీటెక్కింది. నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బండి సంజయ్కు మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారో లేదో.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సీన్లోకి వచ్చారు. హరీశ్ రావు లక్ష్యంగా ఆరోపణలు చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం కోసం ఆయన ఎందుకు శ్రమిస్తున్నారో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు.
కాకి రెట్టంత కూడా చేయలే, గోబెల్స్ ప్రచారం: దుబ్బాక బై పోల్ క్యాంపెయిన్లో హరీశ్ రావు..
భవితవ్యం..
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం మంత్రి హరీశ్ రావు భవితవ్యంపై ఆధారపడి ఉందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని చెప్పారు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఓడిపితే హరీశ్ రావు మంత్రి పదవీ ఊడటం ఖాయమని చెప్పారు. అంతేకాదు ఎమ్మెల్యే పదవీ కూడా ఉండదని చెప్పారు. సోమవారం వేములఘాట్ గ్రామంలో జగ్గారెడ్డి ప్రచారం నిర్వహించారు.
అన్యాయమే..
మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఈ నష్టాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీరుస్తామని హామీనిచ్చారు. వేములఘట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ చూపించాలని జగ్గారెడ్డి కోరారు. హరీష్రావు మంత్రి పదవీ, సిద్దిపేట టికెట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజలపై నిజంగా ప్రేమ లేదని చెప్పారు.
సమస్యలపై ప్రశ్నించడం..
సమస్యల గురించి ప్రశ్నించడానికి కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను జగ్గారెడ్డి కోరారు. ప్రభుత్వం చేసే అన్యాయాలను నిలదీసేందుకు బలమైన గొంతు కావాలన్నారు. దుబ్బాక నుంచి తమ పార్టీ క్యాండెట్ గెలిపిస్తే.. ప్రశ్నించే మరో గొంతు చేరుతుందన్నారు. పనిలోపనిగా బీజేపీపై కూడా ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్- బీజేపీ.. రెండు జోగి జోగి రాసుకుంటే అంటూ కామెంట్ చేశారు.
Recommended Video
దుమారం
మంత్రి హరీశ్ రావు లక్ష్యంగా జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. కానీ దీనిని టీఆర్ఎస్ వర్గాలు ఖండిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో ఏ అంశం లేనందున.. హరీశ్ రావు లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు.