దుబ్బాక ఉపఎన్నిక పరిశీలకుడిగా తమిళనాడు సింగం: యంగ్ ఐపీఎస్కు బాధ్యతలు: ఏరికోరి
హైదరాబాద్: సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలీస్ పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన యువ ఐఎఎస్ అధికారి నియమితులు అయ్యారు. ఆయన పేరు సరోజ్ కుమార్ ఠాకూర్. ప్రస్తుతం చెన్నై సైబర్ క్రైమ్ డివిజన్-3 సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు. ఆయనను దుబ్బాక ఉప ఎన్నిక పోలీసు అబ్జర్వర్గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అధికారులు ఓ ప్రకటన ఇచ్చారు.
ఉప ఎన్నిక బరిలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తోన్న రఘునందన్ రావు, ఆయన బంధువుల ఇళ్లపై పోలీసులు దాడి చేయడం, 18.67 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న రెండోరోజే సరోజ్ కుమార్ ఠాకూర్ను పరిశీలకుడిగా నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే సరోజ్ కుమార్కు తమిళనాడులో సింగంగా గుర్తింపు ఉంది.
రఘునందన్ రావు బంధువుల నివాసంలో నగదు దొరికిన ఉదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. దీని వెనుక అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేతల కుట్ర ఉందంటూ మండిపడుతున్నారు. పోలీసులే తమ బంధువుల ఇంట్లో 18.67 లక్షల రూపాయల నగదును పెట్టారని రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు. సోదాలను నిర్వహించడానికి వచ్చిన పోలీసులను బీజేపీ నేతలు, రఘునందన్ రావు అభిమానులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
Recommended Video
పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకోవడం, రఘునందన్ సొమ్మసిల్లి పడిపోవడం వంటి ఘటనలు సంభవించాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి స్వయంగా దుబ్బాకకు వెళ్లారు. పరిస్థితిని సమీక్షించారు. రఘునందన్ రావును పరామర్శించారు. ఇలాంటి పరిణామాల మధ్య దుబ్బాక ఉప ఎన్నిక పోలీసు పరిశీలకుడిగా ప్రత్యేకంగా ఓ ఐపీఎస్ అధికారిని నియమించడం ఆసక్తికరంగా మారింది.