దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుపై బీజేపీ నేత రామ్ మాధవ్ సంచలన కామెంట్స్: సర్ప్రైజ్
సిద్ధిపేట్: తెలంగాణలోని సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి కొనసాగుతోన్న ఉప ఎన్నిక కౌంటింగ్.. భారతీయ జనతా పార్టీ నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఓట్ల లెక్కింపు ఆరంభమైనప్పటి నుంచీ బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతోంది. రౌండ్ రౌండ్కూ బీజేపీ మెజారిటీ ఓట్లను కైవసం చేసుకుంటోంది. అయిదు రౌండ్ల వరకూ బీజేపీదే హవా. అదే పరిస్థితి మున్ముందూ కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీలో తమ సంఖ్యాబలం పెరుగుతుందని ఆశిస్తున్నారు.
దుబ్బాకలో బీజేపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు పోటీ చేశారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతమ్మ బరిలో నిల్చున్నారు. ఈ ఇద్దరి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస రెడ్డి ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయారనేది ఓట్ల లెక్కింపు తేల్చి చెబుతోంది. దుబ్బాక పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత రామ్ మాధవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దుబ్బాక ఉప ఎన్నిక బరిలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొందని వ్యాఖ్యానించారు. చివరికి తామే విజేతగా నిలుస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఎన్నికలో తమ పార్టీ ఆధిక్యతలో కొనసాగుతోందని అన్నారు. చివరికి- అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన ఫలితం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు రామ్ మాధవ్ తెలిపారు. బీజేపీకి సర్ప్రైజ్ విక్టరీ లభిస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఓ ట్వీట్ చేశారు.
An interesting fight in Telangana between BJP n TRS in Dubbaka Assembly by poll. BJP is currently leading. This could be a surprise victory for BJP
— Ram Madhav (@rammadhavbjp) November 10, 2020
రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదనిపించేలా ఉంది ప్రస్తుతం అక్కడి ఓట్ల లెక్కింపు సరళి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తొలి రౌండ్ నుంచీ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అయిదు రౌండ్ల వరకూ అది కొనసాగుతూనే ఉంది. ఆధిక్యత స్వల్పమే అయినప్పటికీ.. ఎక్కడా తగ్గట్లేదు. ఈ పరిస్థితి ఉండొచ్చని టీఆర్ఎస్ నాయకులు ముందే అంచనా వేశారు. సర్వశక్తులనూ ఒడ్డారు. ఫలితం మాత్రం వారి అంచనాలకు అనుగుణంగా వెలువడట్లేదు.
Recommended Video
ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడం సహజం. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, ఒడిశాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఇదే రకమైన ఫలితాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దుబ్బాక ఫలితం చివరికి టీఆర్ఎస్కు చేదుమాత్రగా మిగిలొచ్చని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉండి, సానుభూతి పరిస్థితుల మధ్య కూడా టీఆర్ఎస్ తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతోందని అంటున్నారు.