ఓ తల్లిలేని బిడ్డకు బంగారు భవిష్యత్ ఇచ్చిన వైనం ... దుబ్బాక ఎమ్మెల్యే దంపతుల ఆదర్శం
కన్న బిడ్డల్ని పెంచి పోషించటమే కష్టంగా మారుతున్న నేటి రోజుల్లో ఓ ఎమ్మెల్యే దంపతులు ఒక ఆడబిడ్డ కష్టం తీర్చారు. ఔదార్యం చూపారు. తండ్రి కర్కశత్వానికి ఆ అమ్మాయి జీవితం బలి కాకుండా చూసారు. చేరదీసి చదివించారు. పెళ్లి చేసి బాధ్యత తీర్చుకున్నారు. ఉన్నతంగా తీర్చిదిద్ది తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేశారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే దంపతులు ఏంటా కథ అంటే
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దంపతుల ఆదర్శమిది. ఓ ఆడపిల్ల జీవితంలో వెలుగు నింపిన కథనమిది . సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్కు చెందిన సావిత్రిని, కామారెడ్డి మండలం పెద్దమల్లారెడ్డికి చెందిన సాయాగౌడ్ పెళ్లి చేసుకున్నాడు . వీరికి ఒక పాప. ఎనిమిదేళ్ల క్రితం భార్యను సాయాగౌడ్ కరెంట్ షాక్ పెట్టి హత్యచేశాడు. ఒక్కగానొక్క కూతురు రేఖను అమ్మేయాలని చూశాడు. అప్పుడు ఆమెకు 17 ఏళ్లు. తండ్రి తనను అమ్మేయాలని చూడటంతో ఆమె దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దంపతులను ఆశ్రయించింది. తన కష్టాన్ని చెప్పుకుంది. రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్ అమ్మమ్మ గారిల్లు కావడంతో రేఖ ఆయన్ను ఆశ్రయించింది.
ఇక తండ్రి బారి నుండి కాపాడి రేఖ బాధ్యతను పూర్తిగా సోలిపేట రామలింగా రెడ్డి , ఆయన సతీమణి సుజాత తీసుకున్నారు. చదువు చెప్పించి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారు. అదే కంపెనీలో పనిచేస్తున్న సురేశ్తో రేఖ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వారి నిర్ణయాన్ని సోలిపేట దంపతులు గౌరవించారు. బుధవారం రేఖ, సురేశ్ల పెళ్లి ఆదర్శంగా జరిపించారు.కన్నతండ్రి చేతిలో హత్యకు గురైన తల్లి.. బిడ్డగా తన పోషణ బాధ్యతను మరిచి అమ్మేయాలని చూసిన తండ్రి ఆ బాలిక జీవితంలో విషాదం నింపితే దుబ్బాక ఎమ్మెల్యే దంపతులు మాత్రం ఆ బాలిక జీవితంలో వెలుగులు నింపారు. అన్నీ తామై పెంచి, పోషించి , సన్మార్గంలో పెట్టి , పెళ్లి చేశారు. అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు.