వీడియో: వైసీపీకి క్షమాపణలు చెప్పిన రఘునందన్: వైఎస్సార్ను మహానేతగా: డ్యామేజ్ కంట్రోల్
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన దుబ్బాక శాసన సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు మెట్టు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దీనిపై ఓ వీడియోను విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేదా ఆయన కుటుంబాన్ని కించపరచాలనేది తన ఉద్దేశం కాదని అన్నారు.
వైఎస్సార్ మరణంపై రఘునందన్ వివాదాస్పద వ్యాఖ్యలు: వైసీపీ ఓట్లను దూరం చేస్తాయా?: దిద్దుబాటు
వైఎస్సార్ను కించపరచలేదు..
తాను వైఎస్సార్ తప్పుగా, కించపరిచేట్టు మాట్లాడలేదని చెప్పారు. ఆదివారం నాటి ప్రెస్మీట్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇదివరకు వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని గుర్తు చేశానని అన్నారు. కేసీఆర్కు కూడా భవిష్యత్లో అలాంటి పరిస్థితి రాకూడదనే సందర్భంలో తాను ఆ వ్యాఖ్యలను చేయాల్సి వచ్చిందని అన్నారు. అంతే తప్ప తన ఉద్దేశం రాజశేఖరరెడ్డిని కానీ, ఆయన కుటుంబాన్ని గానీ కించపరచడం కాదని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా..
తాను ఆ మహానాయకుడిని కించపరచలేదని, తప్పుగా ట్రోల్ చేయవద్దని వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని రఘునందన్ రావు అన్నారు. రాజశేఖర్ రెడ్డి తన హయాంలో ప్రవేశ పెట్టిన పథకాల గురించి తాను చాలాసార్లు సానుకూలంగా మాట్లాడానని అన్నారు. అయినప్పటికి తన మాటలను పొరపాటున అర్థం చేసుకుని బాధపడుతున్న రాజశేఖరరెడ్డి అభిమానులందరికీ నేను పూర్తి స్థాయిలో నిన్నటి ప్రెస్మీట్ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు రఘునందన్ వివరణ ఇచ్చారు.
బీజేపీ పెద్దల నుంచి అక్షింతలు..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన విషయం తెలిసిందే. పావురాల గుట్టలో పోయాడంటూ వైఎస్సార్ను ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ ఓటుబ్యాంకును దూరం చేసినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా వైసీపీ సానుభూతిపరులు ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
24 గంటల్లో..
దీనిపై రఘునందన్కు బీజేపీ పెద్దల నుంచి అక్షింతలు పడినట్టున్నాయని అంటున్నారు. అందుకే డ్యామేజ్ కంట్రోల్కు దిగిందని, రఘునందన్తో క్షమాపణలు చెప్పించిందని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థిరపడిన ఏపీ ప్రజలు, వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓట్లు పక్కకు వెళ్తాయనే ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమైనట్లు చెబుతున్నారు. ఆ కారణంగానే వైఎస్సార్పై వ్యాఖ్యలు చేసిన 24 గంటలు కూడా గడవక ముందే ఆయనతో క్షమాపణలు చెప్పించారని అంటున్నారు.