దుబ్బాకలో విషాదం: ఇంటికొస్తున్నానని తల్లికి యువకుడికి ఫోన్.. ఇంతలోనే ఊహించని షాక్
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు... తిరిగొస్తున్నానని ఫోన్ చేసి... ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు అతని మరణవార్త విని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఆ యువకుడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నది తెలియరాలేదు.
వివరాల్లోకి వెళ్తే... సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన నవకాంత్ అనే యువకుడు ఈ నెల 3న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు శ్రీరాం రవిశేఖర్,జ్యోతి దంపతులు కుమారుడు నవకాంత్ కోసం దుబ్బాక పరిసర ప్రాంతాల్లో వెతికారు. బంధుమిత్రులకు ఫోన్ చేసి నవకాంత్ ఆచూకీ గురించి ఆరా తీశారు. అయినా లాభం లేకపోయింది.
కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు గత ఐదు రోజులుగా తల్లడిల్లుతున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఆదివారం(ఫిబ్రవరి 7) నవకాంత్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. తాను ఇంటికొచ్చేస్తున్నానని చెప్పిన నవకాంత్... తల్లిదండ్రులు ఆందోళన పడవద్దని చెప్పాడు. దీంతో ఆ తల్లిదండ్రుల మనసు కాస్త కుదుటపడింది. కానీ ఇంతలోనే వారికి ఊహించని వార్త ఎదురైంది.
కామారెడ్డి శివారులోని రైలు పట్టాలపై నవకాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో వారి గుండె పగిలినంత పనైంది. కొద్ది గంటల క్రితమే ఫోన్ చేసి ఇంటికి తిరిగొస్తున్నానని చెప్పినవాడు ఇలా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడో వారికి అర్థం కాలేదు. కుమారుడి మరణవార్త విని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. నవకాంత్ జేబులో దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా అతని చిరునామా గుర్తించి సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.