ఒక్కో సెక్షన్లో 88 మంది విద్యార్థులట. గీత దాటితే వేటేనట : ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్ : ఇంటర్ రీ వాల్యుయేషన్ ముగియనే లేదు .. రీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కానీ ఇంటర్ బోర్డు 2019-20 సంవత్సర ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేసింది. దీనిని బట్టి ఇంటర్ బోర్డు సరళి అర్థమవుతోంది. ఓ వైపు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే మరో అకడమిక్ ఈయర్ ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దరఖాస్తు ప్రక్రియ షురూ
ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం బోర్డు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. మొదటి విడత ప్రవేశాల కోసం ఈ నెల 21 నుంచి ధరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. అలాగే జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. రెండో విడత ప్రవేశ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు.
గీత దాటితే వేటే
గతంలో మాదిరిగానే ఈసారి కూడా కార్పొరేట్ కాలేజీలకు నిబంధనలు విధించారు. ఒక్కో సెక్షన్ లో 88 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని స్పష్టంచేశారు. క్లాసులో విద్యార్థుల సంఖ్య పెరిగితే యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
గుర్తింపు ఉంటేనే ..
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోన్న కాలేజీల చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టంచేశారు. బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులను చేర్పించాలని పేరెంట్స్ కు సూచించారు. గుర్తింపు పొందిన కాలేజీ వివరాలు బోర్డు వెబ్ సైట్ లో ఉంచామని స్పష్టంచేశారు.