ఎంసెట్ 2 రద్దు, 200 మంది పేరెంట్స్కు శిక్ష తప్పదు: కేసీఆర్
హైదరాబాద్: ఎంసెట్ 2 రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది. ఎంసెట్ 2పై నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తప్పనిసరి పరిస్థితుల్లోనే పరీక్షను రద్దు చేయాల్సి వస్తోందని, విద్యార్థులు పాత హాల్ టిక్కెట్లతోనే పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఎంసెట్ 3 నిర్వహణ బాధ్యతలకు జేఎన్టీయూకే అప్పగించాలని సూచించారు.
ఎంసెట్పై కేసీఆర్ ఆదేశం: తవ్వినకొద్దీ బయటకు తిరుమల్ లీలలు
కొత్త కన్వీనర్, కో కన్వీనర్ సభ్యులను నియమించాలన్నారు. ఎంసెట్ 3 షెడ్యూల్ త్వరగా ప్రకటించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు హాల్ టిక్కెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాటు చేయాలన్నారు.
ఎంసెట్ రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు. పరీక్షకు సిద్థమయ్యేలా జేఎన్టీయూ వెబ్ సైట్లో స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ ఇతర సమాచారం ఉంచాలని కేసీఆర్ సూచించారు. విద్యార్థులను మళ్లీ పరీక్ష రాయించడం బాధాకరమే అయినా గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పరీక్ష నిర్వహిస్తున్నామని.. విద్యార్థులు, తల్లిదండ్రులు సహృదయంతో సహకరించాలని కేసీఆర్ కోరారు.
ఎంసెట్ 3 పరీక్ష నిర్వహణ కోసం విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయమన్నారు. లీకేజీ దోషులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖను కేసీఆర్ ఆదేశించారు. ఎంసెట్ లీకేజీలో 30 మందికే పైగా దోషులు ఉన్నారని, ముకుల్ జై, మయాంక్ శర్మ, సునీల్ సింగ్, ఇర్ఫాన్ అనే నలుగురు కీలక సూత్రధారులు అని, వీరికి 30 మంది బ్రోకర్లుగా వ్యవహరించారన్నారు.
బ్రోకర్లు పరీక్షలు రాసిన 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారని, వారి పైనా చర్యలు తప్పవన్నారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిలో ఇప్పటికే ఆరుగురిని సీఐడీ అధికారులు అరెస్టు చేసారని, మిగిలిన వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారన్నారు. ఢిల్లీ కేంద్రంగా లీకేజీ నడిచిందని చెప్పారు.