అనుమానాలు: సీఐడీ కస్టడీలోని ఎంసెట్ లీకేజీ ప్రధాన నిందితుడు మృతి
సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన కమిలేశ్వర్ మృతిచెందాడు.
హైదరాబాద్: సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన కమిలేశ్వర్ మృతిచెందాడు. దీంతో స్కాంకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. కాగా, బీహార్కు చెందిన కమిలేశ్వర్ ప్రస్తుతం తెలంగాణ సీఐడీ కస్టడీలో ఉన్నాడు.
కస్టడీలో ఉండగానే, రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరిన కమిలేశ్వర్.. చికిత్స పొందుతూ మృతిచెందినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. అయితే నిందితుడి మృతదేహానికి ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది.
ఎంసెట్ స్కాంలో ఇద్దరు ప్రధాన నిందితులను సీఐడీ నాలుగు రోజుల క్రితమే పాట్నాలో అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్పై రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడి సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టారు.
కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. విచారణ సమయంలో నిందితుడు కమిలేశ్వర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చామని అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్టు పేర్కొన్నారు.
పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న అధికారుల మెడకు కమిలేశ్వర్ మృతి వ్యవహారం చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమిలేశ్వర్ మృతితో ఎంసెట్ స్కాం గురించిన కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం లేకుండాపోయింది. అతనికి సహకరించిన వారి వివరాలు కూడా బయటికిరాకుండా పోయాయి.
ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కమిలేశ్వర్ ఎంసెట్ల లీకేజీకి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఐడీ విచారిస్తుండగా ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అతని మృతదేహాన్ని బీహార్లోని బంధువులకు అందించేందుకు తరలించారు.