చరిత్ర సృష్టిస్తారా? చతికిలపడతారా?: 3 దశాబ్దాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత కేసీఆరే!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు గానూ 105 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు.
ముందస్తు ఎన్నికలు: కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థులు వీరే
కాగా, గత మూడు దశాబ్దాల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ శాసనసభ రద్దు నిర్ణయంతో తొలిసారి జరుగుతున్నాయి.
తొలిసారి ముందస్తులో ఘన విజయం
తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) 1983లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు. ఆనాడు ఏకంగా 294 స్థానాలకు గానూ 201 స్థానాలు గెలుచుకొని రికార్డు సృష్టించారు. అయితే, కొద్ది కాలానికే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం.. నాదెండ్ల భాస్కరరావును సీఎంగా చేయడం జరిగింది. దీంతో రాష్ట్రా వ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో తగ్గిన కేంద్రం ప్రభుత్వం మళ్లీ ఎన్టీఆర్కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించింది.
1985లో మరోసారి భారీ గెలుపు
కాగా, ఆ సమయంలో టీడీపీకి చెందిన పలువురు ఫిరాయించడంతో ఎన్టీఆర్.. మరోసారి ప్రజల తీర్పును కోరుతూ 1985లో శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 1985లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ వామపక్షాలు, బీజేపీకి సీట్లను కేటాయించి పోటీలో దిగారు. మొత్తం 249 సీట్లకు జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 209, సీపీఐ 11, సీపీఎం 11, బీజేపీ 10 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 50సీట్లకే పరిమితమైంది. ముందస్తుకు వెళ్లినా టీడీపీ భారీ విజయం సాధించడం గమనార్హం.
పార్లమెంటులో ప్రతిపక్షంగా టీడీపీ..
అయితే, 1984లో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం టీడీపీ పోటీ చేసిన 36స్థానాల్లో 30స్థానాలను గెలుచుకుంది. 1984 నుంచి 1989 వరకు లోక్సభలో టీడీపీనే ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం విశేషం. ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో ప్రతిపక్షంగా ఉండటం అదే తొలిసారి కావడం గమనార్హం.
ఆ తర్వాత ముందస్తుకు వెళ్లిన చంద్రబాబు మాత్రం..
ఎన్టీఆర్ రెండుసార్లు ఘన విజయం సాధించగా.. ఆ తర్వాత టీడీపీ అధినేతగా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన నారా చంద్రబాబు నాయుడుకు మాత్రం ఎదురుదెబ్బే తగిలింది. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నాటి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అప్పట్లో వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సైతం ముందస్తుకు సిద్ధం కావడంతో లోక్సభకు అసెంబ్లీకి కలిపి ఎన్నికలు నిర్వహించారు. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 185 స్థానాల్లో గెలుపొందగా, ఆ పార్టీకి మద్దతిస్తూ పోటీ చేసిన టీఆర్ఎస్కు 26, సీపీఎం 9, సీపీఐ 6స్థానాల్లో గెలుపొందింది. 47స్థానాల్లో గెలుపొందిన టీడీపీ ప్రతిపక్షానికే పరితమైంది. ఈ ఫలితాలను బట్టి చంద్రబాబు నిర్ణయం టీడీపీకి గట్టి ఎదురుబెబ్బగానే చెప్పుకోవచ్చు.
మూడు దశబ్దాల తర్వాత కేసీఆర్..
గతంలో ఇలా ఉంటే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతోనే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. 2014 కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ జరుగుతున్న తొలి ముందస్తు ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరుగనుండటంతో వాటితోపాటు నవంబర్లో తెలంగాణకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్ ఘన విజయం సాధిస్తే.. చంద్రబాబు మాత్రం చతికిలపడ్డారు. ఇప్పుడు కేసీఆర్ గెలుస్తామనే ధీమాతోనే ముందస్తుకు వెళుతున్నప్పటికీ ఫలితాలెలా ఉంటాయనేదానిపై మాత్రం సర్వత్రా ఉత్కంఠగానే మారింది. ప్రతిపక్ష పార్టీలు కూడా ముందస్తుకు సిద్ధంగా ఉన్నామంటున్నప్పటికీ అధికార పార్టీకి ఏమాత్రం పోటీనిస్తాయనేది వేచిచూడాల్సిందే.