ముందస్తు-అసెంబ్లీ రద్దు హీట్: గవర్నర్ను కలిసిన కేసీఆర్, 11మంది ఐఏఎస్ల బదలీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఢిల్లీ పర్యటన విషయాలు ఆయనతో చర్చించారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దుపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయనతో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ కావడం, ఆయన గవర్నర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తప్ప మరో పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేరుగా అన్నారు. తాము ఏం తప్పు చేశామని ప్రజలు కాంగ్రెస్కు అవకాశమిస్తారన్నారు. కాంగ్రెస్ నాయకులు అందరూ దొంగలు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించకుండా ప్రాజెక్టు గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరన్నారు.
దేశాన్ని ఉధ్ధరించామని చెపుతున్న బీజేపీ హైదరాబాద్లో ఒక్క సీటు అయినా గెలుస్తుందా అన్నారు. ముంద్తు ఎన్నికలపై మాట్లాడుతూ.. ముందస్తు ఉంటుందని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. నాలుగున్నరేళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినా సాధారణ ఎన్నికలే అన్నారు. తమకు అభద్రతా భావం లేదన్నారు.
ఐఏఎస్ల బదలీ
ప్రభుత్వం 11మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్గా రఘునందన్ రావు, ప్రజారోగ్య, కుటుంబసంక్షేమ డైరెక్టర్గా యోగితా రాణా, రంగారెడ్డి కలెక్టర్గా లోకేశ్ కుమార్, సిరిసిల్ల కలెక్టర్గా వెంకట్రామి రెడ్డి, వరంగల్ అర్బన్ కలెక్టర్గా పాటిల్ ప్రశాంత్ జీవన్, సిద్దిపేట కలెక్టర్గా కృష్ణభాస్కర్, ఆసిఫాబాద్ కలెక్టర్గా రాజీవ్ గాంధీ హనుమంతు, ఖమ్మం కలెక్టర్గా అర్వీ కర్ణన్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా వెంకటేశ్వర్లు, సంగారెడ్డి కలెక్టర్గా హన్మంతరావు, కొత్తగూడెం కలెక్టర్గా అమోయ్ కుమార్లను నియమించింది.