ఢిల్లీలో కేటీఆర్, సీఈసీతో రాజీవ్: మరోసారి 'ముందస్తు', కేసీఆర్ వ్యూహమేనా?
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికల హడావుడిపై చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారమే ముందస్తు ఎన్నికలు ఉండవని తేల్చి చెప్పారు. కానీ హైదరాబాద్, ఢిల్లీ పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Recommended Video
ఓ వైపు హైదరాబాదులో కేసీఆర్ గవర్నర్ నరసింహన్ను కలిశారు. మరోవైపు ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. మంత్రి కేటీ రామారావు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో మరోసారి ముందస్తుపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ముందస్తు వట్టిదేనని ప్రభుత్వ సలహాదారు కొట్టి పారేశారని తెలుస్తోంది.
ముందస్తు ఊహాగానాలు
తెలంగాణలో కేసీఆర్ ముందస్తుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేసీఆర్, తెరాస నేతలు వివరణ ఇచ్చే ప్రయత్నం ఎప్పటికి అప్పుడు చేస్తున్నారు. ముందస్తుపై బుధవారం మంత్రులు అడగ్గా.. అలాంటిదేమీ లేదని వారికి స్పష్టం చేశారు. కానీ మళ్లీ నేటి పరిణామాలు చర్చకు తావిస్తున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ముందస్తుకు సై అంటున్నారు. రాజీవ్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు సీఈసీని కలిశారు.
ముందస్తు కాదు కానీ
ముందస్తు ప్రచారంపై తెలంగాణ ప్రతినిధి వేణుగోపాల చారి మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలు అనే మాట గత కొంతకాలంగా వినిపిస్తోందని, కానీ అలాంటి ఆలోచన తమకు లేదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులు, ప్రజల అభిప్రాయం చూస్తే తెరాసనే మళ్లీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. గత నాలుగేళ్లలో తెరాస చేసిన కార్యక్రమాలను ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు. తమకు ముందస్తు ఆలోచన లేదని, కానీ కేంద్రం ముందస్తు పెడితే మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటన్న దానిపై మాత్రమే చర్చిస్తున్నామన్నారు.
ముందస్తు అనే చర్చ అందుకేనా?
తెలంగాణలో గత కొద్దికాలంగా జరుగుతున్న ముందస్తు ప్రచారం అంతా కేసీఆర్ లేదా టీఆర్ఎస్ వ్యూహంగానే భావిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ బాగా పుంజుకోవడంతో పాటు, బీజేపీ కూడా చొచ్చుకుపోతోంది. ఈ నేపథ్యంలో తమ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పేందుకే ముందస్తు అనే వ్యూహాన్ని తెరపైకి తెచ్చారా అనే చర్చ సాగుతోంది.
ఆ ప్రచారం ఎందుకు?
ఏ పార్టీ కూడా తమకు అనుకూలంగా లేదని భావించిన సమయంలో ముందస్తు అనే మాట చెప్పదు. ఇప్పుడు తెరాసపై వ్యతిరేకత ఉందని, మరి ఆ పార్టీ ఎందుకు చేస్తున్నట్లు అనే ప్రశ్న ఉదయించవచ్చునని, కానీ ప్రజల్లో వ్యతిరేకత లేదని చెప్పేందుకు.. తమ పట్ల అనుకూలంగా ఉన్నారని చెప్పేందుకే ముందస్తు అనే వ్యూహం కావొచ్చని అంటున్నారు. కాగా, కేసీఆర్ ముందస్తుపై మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించగా, నో చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.