నేనేం ఆ నిర్ణయాలు తీసుకోవట్లేదు!: 'రాష్ట్రపతి పాలన'పై గవర్నర్తో కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల ప్రచారం, ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించిన.. నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
చదవండి: లగడపాటి సర్వే, కాంగ్రెస్ గెలుపు, కేసీఆర్కు భారీ షాక్ అంటూ: అసలు నిజం ఏమంటే?
కేసీఆర్ మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లిన ఒక గంటసేపు గవర్నర్తో భేటీ అయ్యారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గవర్నర్ను కలవడం ఇదే మొదటిసారి. వినాయకచవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణలోని తాజా పరిస్థితులపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
సీఈసీ ప్రతినిధి బృందం రాష్ట్ర పర్యటన, రాష్ట్రంలో ఎన్నికల సన్నాహకాలు, ఇతర పాలనా అంశాలపై భేటీలో చర్చ జరిగినట్లుదా తెలుస్తోంది. కొండగట్టు ప్రమాదం, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం, క్షతగాత్రులకు వైద్య సహాయం తదితర అంశాలను కేసీఆర్... గవర్నర్కు వివరించారని తెలుస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ను ఆపద్ధర్మ సీఎంగా ఉంచవద్దని విపక్షాలు ఫిర్యాదు చేశాయి. రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ను ఇటీవల కోరాయి. ఈ అంశంపై కూడా వారు చర్చించారని తెలుస్తోంది. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటూ తాము విధానపర నిర్ణయాలు ఏవీ తీసుకోవడం లేదని, రాజ్యాంగ బద్ధంగానే నడుచుకుంటున్నట్లు కేసీఆర్ వివరించారని సమాచారం.