2నే తెలంగాణ కేబినెట్ భేటీ: కేసీఆర్ నిర్ణయం, ‘ముందస్తు’ ప్రకటనపై ఉత్కంఠ
Recommended Video
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ముందస్తు ఆలోచనలు చేస్తున్న సమయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశంపై గత వారం రోజులుగా జరుగుతున్న సందిగ్ధతకు తెరపడింది. సెప్టెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రివర్గ భేటీని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
నివేదన సభకు ముందే కేబినెట్ భేటీ
ఈ నేపథ్యంలో జరిగే మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఆదివారం జరగబోయే రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడవచ్చని భావిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలోనే శాసనసభ రద్దుకు నిర్ణయం తీసుకొని, అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభకు వెళ్లి ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం
ఈ మంత్రివర్గ సమావేశంలో వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకొని సభ తర్వాత మరోసారి రద్దు కోసం మంత్రివర్గ భేటీ నిర్వహించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. పింఛను మొత్తం పెంపు, ఉద్యోగులకు మధ్యంతర భృతి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి మొదట మంత్రివర్గ సమావేశం జరుగుతుందని.. ఆ తర్వాత కేవలం శాసనసభ రద్దు కోసమే ఇంకోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారని తెలిసింది. ఇక మొత్తమ్మీద 10వ తేదీలోగా శాసనసభ రద్దు ప్రక్రియ పూర్తవుతుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ముందా? తర్వాతా?
ముఖ్యమంత్రి, మంత్రులు సభపైన పూర్తిగా దృష్టి కేంద్రీకరించినందున రెండో తేదీ తర్వాతే మంత్రివర్గ భేటీ నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్న ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం(2న) జరిగే సమావేశంలో వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు శాసనసభ రద్దుకు కూడా సిఫార్సు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముందస్తుపై ఉత్కంఠ
శాసన సభ రద్దుకు నిర్ణయం తీసుకొని, ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదిన బహిరంగ సభలో.. తమ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్మాణం, విపక్షాల రాజకీయాలు, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తీసుకొన్న నిర్ణయాన్ని వివరించి మళ్లీ ఎన్నుకోవాలని పిలుపిచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అయితే, కేబినెట్ భేటీ తర్వాతే ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా, ఆదివారం నిర్వహించే ప్రగతి నివేదన సభకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు కొంగరకలాన్కు తరలివస్తున్నారు.