వీకెండ్ బిర్యానీ పార్టీలు: సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో సమస్యలకు కారణమవుతున్నాయా?
హైదరాబాద్: వీకెండ్ వచ్చిందంటే చాలు. మనలో చాలా మంది లొట్టలు లేసుకుంటూ చికెన్, మటన్ బిర్యానీ తినేస్తుంటారు. అయితే ఇకపై అతిగా బిర్యానీ తింటే అనారోగ్యం పాలు కాక తప్పదు. ప్రతి వారం బిర్యానీ తినే అలవాటును అదుపులో ఉంచుకోకపోతే కాలేయ సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని పరిశోధకులు అంటున్నారు.
ఈ మేరకు నిర్వహించిన తాజా పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆల్కహాల్ తీసుకునే వారిలో కాలేయ సమస్యలు వస్తాయనుకోవడం పొరపాటు అని ఈ సర్వే ద్వారా తెలిపారు. అదేపనిగా చికెన్, మటన్ బిర్యానీలు తినేవారిలో కూడా కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయన్నారు.
అంతేకాదు ఎటువంటి మద్యం అలవాట్లు లేకున్నా కాలేయ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ప్రతి ఏడాది 30 నుంచి 35 శాతం వరకు పెరుగుతోందని ఈ సర్వే ద్వారా తెలిసింది. ముఖ్యంగా నగరాల్లో ఈ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.
ముఖ్యంగా వారంతం సెలవుల్లో నాన్ వెజ్ బిర్యానీ ఎక్కువగా తినే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాలేయ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారని పరిశోధనలో తేలింది. అకస్మాత్తుగా కడుపునొప్పి రావడం, ఛాతి నొప్పి, నీరసం వంటి లక్షణాలతో బాధితులు ఎక్కువగా ఆసుపత్రి పాలవుతున్న విషయాన్ని పరిశోధకులు ప్రస్తావించారు.
బిర్యానీ తయారీకి వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వినియోగించడం, నాణ్యత లేని మాంసాహారాన్ని వాడటం కారణంగా కాలేయ సమస్యలకు ఒక కారణంగా పేర్కొన్నారు. ఇటీవల కాలంలో చూస్తే హోటళ్లలో భోజనం చేసే వారు బిర్యానీ తినే సమయంలో కూల్ డ్రింక్ తీసుకోవడం కూడా కాలేయ సమస్యలకు కారణం అవుతుందని పరిశోధన ద్వారా తెలిసింది.