ఎన్నికలు: తెలంగాణలో ఏపీ పోలీసులొద్దు: తేల్చేసిన ఈసీ
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితంచేసే అవకాశమున్నందున బందోబస్తు ఏర్పాట్లకు ఏపీ పోలీసులు, హోంగార్డులను తీసుకోవడంలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ స్పష్టంచేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవల తెలంగాణలో డబ్బులు పంచుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
'బాబూ అరాచకం సృష్టిస్తే ఊరుకోం! ఏపీ పోలీసులతో డబ్బులు పంచుతావా?: రాహుల్తో రూ.500కోట్ల డీల్'
ఇతర రాష్ట్రాల నుంచి బలగాలు
ఎన్నికల సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతల అంశం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందని రజత్ కుమార్ తెలిపారు. అయినప్పటికీ సాధారణ పోలీసు విధులు కొనసాగుతాయని, ఎన్నికల అంశాలు మాత్రమే తమ పరిధిలోకి వస్తాయని వివరించారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణకు 25 వేలమంది హోంగార్డులు కావాలని చెప్పారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి ఐదు వేలమంది చొప్పున బలగాలను కోరామని తెలిపారు.
సవ్యంగానే శాంతిభద్రతలు
తెలంగాణలో శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నాయని రజత్కుమార్ తెలిపారు. నేరచరితులను బైండోవర్ చేస్తున్నామని, నాన్బెయిలబుల్ వారెంట్లున్న వారిని అరెస్టుచేసే అవకాశం కూడా ఉన్నదని చెప్పారు. వ్యక్తిగత లైసెన్సులున్న తుపాకులను, ఇతర మారణాయుధాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని, ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా ఫ్లాగ్మార్చ్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్రం నుంచి 307 కంపెనీల బలగాలను కోరగా, 250 కంపెనీలకు అనుమతి లభించిందని, వాటితోపాటు రాష్ట్రానికి చెందిన 70 వేలమంది పోలీసు సిబ్బందిని, అదనంగా 25 వేలమంది హోంగార్డులను ఎన్నికల్లో మోహరిస్తామని వివరించారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.26.73 కోట్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.35 లక్షల విలువైన 10,600 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామని తెలిపారు.
కేంద్రం నుంచి పరిశీలకులు.. పక్కగా ఆడిట్
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను పరిశీలించేందుకు 53 మంది కేంద్ర ఎన్నికల పరిశీలకులు వస్తున్నారని సీఈవో రజత్ కుమార్ తెలిపారు. అభ్యర్థుల ఖర్చులపై పక్కాగా ఆడిటింగ్ జరుగుతుందని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు డమ్మీలను బరిలో దింపి ఖర్చుల భారం తమపై పడకుండా చూసుకోవడం పరిపాటిగా మారిందని, అలాంటివారిపైనా నిఘా ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. జాతీయ పార్టీలకు 40 మంది, ప్రాంతీయ పార్టీలకు 20 మంది చొప్పున స్టార్ క్యాంపెయినర్లకు అవకాశం ఉంటుందని, వీరి ప్రచార ఖర్చులన్నీ సదరు రాష్ట్ర పార్టీ కమిటీలకు వర్తిస్తాయని చెప్పారు.
తనిఖీలు సాధారణమే..
ఎన్నికల కమిషన్కు ఎలాంటి వివక్ష ఉండదని సీఈవో రజత్కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో తనిఖీలు సాధారణమేనని, ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించే ప్రశ్నేలేదని స్పష్టంచేశారు. ఈ విషయమై తెలంగాణ డీజీపీ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందామని చెప్పారు. పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తోందని సీఈవో చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి 59 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులోఎక్కువ హైదరాబాద్ పరిధిలోనే 25 కేసులు ఉన్నాయని తెలిపారు.