ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారా?: డీజీపీని నివేదిక కోరిన ఈసీ
హైదరాబాద్: తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ మహాకూటమి నేతలు గురువారం ఇచ్చిన ఫిర్యాదులను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఈ విషయంపై నివేదిక కోరారు.
ఎవరివైనా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయా? చేస్తే ఎవరెవరివి ట్యాప్ చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని కోరారు. ఎంఎంటీఎస్ రైళ్లలో సీఎం కేసీఆర్ ఫొటోలతో కూడిన ప్రకటనలు పెట్టారనే ఫిర్యాదుపైనా ఆయన స్పందించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం నుంచి ఆయన నివేదిక కోరారు.
ప్రగతిభవన్లో రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపైనా ఈసీ వివరణ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాహనాల తనిఖీలో భాగంగా ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా వేధిస్తూ, కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని, సెల్ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మహాకూటమి నేతలు గురువారం ఆరోపించిన విషయం తెలిసిందే.