కేసీఆర్ కు ఈసీ షాక్.. బీఆర్ఎస్.. ఆంధ్రప్రదేశ్ అంటూ; తెలంగాణాకు గుర్తింపేది?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి ఎన్ని సంవత్సరాలైనా, రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ గుర్తించటం లేదా? అన్నఅంశం తాజాగా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం లేకపోలేదు. టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడైన కేసీఆర్ కు అధికారికంగా పంపిన లేఖ కెసిఆర్ కు మాత్రమే కాకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చింది.
పార్టీ పేరు మార్పుపై ఈసీ పంపిన లేఖతో కేసీఆర్ కు షాక్
టిఆర్ఎస్ పార్టీ బి ఆర్ ఎస్ పార్టీగా మార్పు జరిగింది. ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి గా మార్చటానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు భారత రాష్ట్ర సమితి పేరు మార్పు ఆమోదిస్తూ అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపించింది. పార్టీ పేరు మార్పు గులాబీ బాస్ కెసిఆర్ కు సంతోషం కలిగించే విషయమే అయినప్పటికీ, ఈసీ పంపిన ఈ లేఖ మాత్రం కెసిఆర్ కు షాక్ ఇచ్చింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణాగా మార్చకుండానే లేఖ
గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ పంపించిన ఈసీ తెలంగాణా రాష్ట్రం ప్లేసులో ఆంధ్రప్రదేశ్ అని పాత లెటర్ హెడ్ తోనే, లేఖ పంపించటం అందరినీ షాక్ కు గురి చేసింది. తెలంగాణ రాష్ట్రం విడిపోయి ఎనిమిది సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఆంధ్ర ప్రదేశ్ అని కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపించడం, రాష్ట్ర విభజన జరగక ముందు పంపిన అడ్రస్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంతవరకూ తెలంగాణగా మార్చకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
తెలంగాణా ఏర్పాటు తర్వాత అన్ని చోట్ల మారిన రాష్ట్రం పేరు
టిఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భవించినప్పుడు పార్టీ అడ్రస్ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 గా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే పార్టీ ఏర్పడిన 13 ఏళ్లకు 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఇక అప్పటి నుండి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉన్న అన్ని చోట్ల తెలంగాణ పేరు మారుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిది సంవత్సరాలు దాటింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా, మూడు అసెంబ్లీ ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధమైంది. ఇక దేశానికే తెలంగాణా మార్గనిర్దేశం చేస్తుందని కూడా కేసీఆర్ పదేపదే చెప్తున్నారు. అయితే తెలంగాణాను ఎవరూ గుర్తించటం లేదా అన్న చర్చ ఈసీ లేఖతో జరుగుతుంది.
తెలంగాణా రాష్ట్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మరచిపోయిందా?
ఇక ఈ సమయంలో ఇంతవరకూ తెలంగాణ రాష్ట్రం పేరు ఈసీ మార్చకపోవటంపై అందరి నుండి విస్మయం వ్యక్తమవుతోంది. టిఆర్ఎస్ పార్టీ అడ్రస్ లో ఇంకా ఆంధ్రప్రదేశ్ అని ఉండడం ఏమిటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అడ్రస్ తో ఈసీ పంపిన లేఖ హల్ చల్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా మరిచిపోయిందని దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.