బోయిన్పల్లి కిడ్నాప్ కేసు : భార్గవ్ రామ్,జగత్ విఖ్యాత్ రెడ్డిల బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు...
హైదరాబాద్ బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడు భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. భార్గవ్ రామ్ తరుపున ఆయన తల్లిదండ్రులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. భార్గవ్ రామ్తో పాటు భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేసింది. గతంలోనూ భార్గవ్ రామ్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న భార్గవ్ రామ్ ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అతనితో పాటు జగత్ విఖ్యాత్ రెడ్డి,గుంటూరు శ్రీనుల ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్ హఫీజ్పేటలోని 50 ఎకరాల భూ వివాదం నేపథ్యంలో ఈ కిడ్నాప్ జరిగిన సంగతి తెలిసిందే. బోయిన్పల్లిలో నివాసం ఉండే ప్రవీణ్ రావు సోదరులను భూమా అఖిలప్రియ విజయవాడకు చెందిన గ్యాంగ్తో కిడ్నాప్ చేయించింది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పేరిట ప్రవీణ్ రావు ఇంట్లో చొరబడ్డ నిందితులు వారిని భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో నగరంలో ఎక్కడికక్కడ ప్రత్యేక పోలీస్ బృందాలను దించి 24గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత మాజీ మంత్రి భూమా అఖిలప్రియను కూడా అరెస్ట్ చేసి చంచల్గూడా జైలుకు తరలించగా... ఇటీవలే ఆమె బెయిల్పై విడులయ్యారు. ఈ కేసులో డే-1 నుంచి భార్గవ్ రామ్ పరారీలో ఉన్నారు. అతను పట్టుబడితే కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ కేసులో ఇరువురి మధ్య నెలకొన్న వివాదంపై స్పష్టత లేదు.
అఖిలప్రియ కుటుంబ సభ్యుల వాదన ప్రకారం... హఫీజ్పేటలో భూమా నాగిరెడ్డికి 33 ఎకరాల భూమి ఉంది. నాగిరెడ్డి బినామీ ఏవీ సుబ్బారెడ్డి ఆ భూ వ్యవహారాలు చూసుకునేవారు. 2005 నుంచి ఈ భూమికి కృష్ణారావు న్యాయవాదిగా ఉన్నారు. ఆయన మరణానంతరం కుమారుడు ప్రవీణ్ రావు,మేనల్లుడు సునీల్ రావు ఆ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈ భూమి చుట్టూ పలు వివాదాలు ఉండటంతో 2015లో ఏవీ సుబ్బారెడ్డి ప్రవీణ్ రావు సోదరుల నుంచి నగదు తీసుకుని పక్కకు తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అఖిలప్రియకు ప్రవీణ్ రావు సోదరులకు మధ్య వివాదం నెలకొన్నది.
మరోవైపు ప్రవీణ్ రావు సోదరులు మాత్రం ఆ భూమికి చాలామంది పార్ట్నర్స్ ఉన్నారని... భూమా నాగిరెడ్డి గతంలోనే దీని నుంచి తప్పుకుని డబ్బులు తీసుకున్నారని చెబుతున్నారు. భూమా ఫ్యామిలీకి వారి పార్ట్నర్స్తో ఉన్న విభేదాలే ఈ కిడ్నాప్కు కారణమని చెప్పారు. పార్ట్నర్స్తో తేల్చుకోవాలని రెండేళ్ల క్రితమే వారికి చెప్పామని... కానీ భూమా కుటుంబం మళ్లీ తమ మీదే గొడవకు దిగుతోందని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.