జగన్ ఆస్తుల కేసు: బదలీ చేయమని ఈడీకి సిబిఐ కోర్టు షాక్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ కోర్టులో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చుక్కెదురైంది. కేసును సిబిఐ నుంచి ఈడీకి బదలీ చేయాలన్న ఈడీ పిటిషన్ పైన సీబీఐ కోర్టు నో చెప్పింది.
ఈ కేసుకు సంబంధించి జగతిలో రూ.34 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసును ఈడీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలన్న ఈడీ ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో మరిన్ని ఫిర్యాదులు దాఖలు చేస్తామన్న నేపథ్యంలో అన్నీ దాఖలు చేశాక ఇక్కడ మరోసారి పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సిబిఐ న్యాయస్థానం ఈడీకి సూచించింది. ఈ దశలో జగతిలో పెట్టుబడులకు సంబంధించిన ఒక కేసును మాత్రం బదిలీ చేయలేమంది.
జగతిలో మాధవ రామచంద్రన్, దండమూడి ఎకె, టిఆర్ కన్నన్లు పెట్టిన పెట్టుబడులపై సిబిఐ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా దర్యాప్తు చేసి ఈడీ సిబిఐ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సిబిఐ నమోదు చేసిన కేసును.. ఈడీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరింది.
కోర్టులో విచారణ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ... సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేసి పదకొండు ఛార్జీషీట్లు దాఖలు చేసిందని, ఈడీ కూడా అదేవిధంగా ఫిర్యాదులు దాఖలు చేస్తోందని, అవినీతి నిరోధక చట్టం కింద విచారించే పరిధి ఈడీ ప్రత్యేక కోర్టుకు లేదన్నారు.