రాంచీ ఎక్స్ప్రెస్ హైవే కేసులో ఈడీ ప్రొసీడింగ్స్ కొట్టెయ్యాలని హైకోర్టులో ఎంపీ నామా!!
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎంపీలు వివిధ కేసుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో, విచారణతో ఇబ్బంది పడుతున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని టిఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఈడీ చేపట్టిన ప్రొసీడింగ్స్ ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రోడ్డు పనుల కోసం బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు పొంది వాటిని ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపిస్తూ 2020 వ సంవత్సరంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుపై ఈడీ కేసు నమోదు చేయడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే లిమిటెడ్ కంపెనీ తో కానీ, మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తో కానీ, మధుకాన్ ఇన్ఫ్రా, మధుకాన్ టోల్ హైవేస్ కంపెనీలతో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. 2009లోనే తాను మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లకు రాజీనామా చేసినట్టుగా నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
అయినా ఈ కేసులో ఈడి అధికారులు తన ఇళ్లపై, ఆస్తులపై దాడులు చేయడంతో పాటు, తన ఆస్తులను అటాచ్ చేశారని నామా నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఈడీ ఆస్తుల అటాచ్మెంట్ కేసులో హైకోర్టులో వాదనలు వినిపించిన ఎంపీ నామా నాగేశ్వరరావు తరపు న్యాయవాది ఈడీ కేసును కొట్టివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఏకసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ నిర్వహించింది. ఈ క్రమంలో పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ ఈడీ కేసుకు ఆధారమైన సీబీఐ కేసులో ఎఫ్ఐఆర్లో కానీ, చార్జిషీట్లో కానీ నామా నాగేశ్వరరావు పేరు లేదని పేర్కొన్నారు.
ఏ ఆధారాలతో ఈడీ ఆయన ఆస్తులను అటాచ్ చేసిందో తెలియదన్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి విరుద్ధంగా ఈడీ చర్యలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఇక ఈడీ తరఫున సౌత్ జోన్ అదనపు సొలిసిటర్ జనరల్ సూర్య కరణ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక ఈ వాదనలు విన్న ధర్మాసనం ఈడీ దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఇక ఈ కేసును విచారించడానికి డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.