ఓటుకు నోటు కేసు: దాని ఆధారంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) మంగళవారం సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఆయన విచారణకు హాజరయ్యాక.. మధ్యాహ్నం దాదాపు అరగంట విరామం ఇచ్చి మళ్లీ ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ కేసులో గత వారం వేం నరేందర్ రెడ్డి, ఆయన కొడుకును ఈడీ ప్రశ్నించింది. తాజాగా రేవంత్ను ప్రశ్నిస్తోంది.
ఏసీబీ ఛార్జీషీట్ ఆధారంగా రేవంత్ను ప్రశ్నిస్తున్న ఈడీ
ఏసీబీ ఛార్జీషీట్ ఆధారంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని ఈడీ ఆరా తీసే ప్రయత్నాలు చేసింది. గత వారం కూడా ఈ 50 లక్షల రూపాయల గురించి వేం నరేందర్ రెడ్డిని, కొడుకులను ప్రశ్నించింది. ఈడీ విచారణ కక్ష సాధింపు అని వేం నరేందర్ రెడ్డి నాడు విచారణ అనంతరం చెప్పారు.
రూ.50 లక్షలు ఎక్కడివి, రూ.4.50 కోట్ల మాటేమిటి?
బ్యాగులో రూ.50 లక్షలు తెచ్చారని, ఆ డబ్బు ఎక్కడిది అనే కోణంలోనే ఈడీ ప్రధానంగా ప్రశ్నిస్తోందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన తర్వాత రూ.4.50 కోట్లు ఇస్తామని చెప్పారని, అది ఎక్కడి నుంచి తెద్దామనుకున్నారనే అంశాలపై కూడా ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని గతంలో ఇన్కం ట్యాక్స్ అధికారులు, ఏసీబీ అధికారులు కూడా విచారించారు. రేవంత్ అనుచరుడు ఉదయ్ సిన్హాను సోమవారం ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.
సుదీర్ఘ విచారణ
రేవంత్ రెడ్డి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు వచ్చారు. ఆరు గంటలకు పైగా ఆయన విచారణ కొనసాగుతోంది. ఆయనను నలుగురు అధికారుల బృందం ఆయనను విచారించింది. తాజాగా, మరికొంతమందికి నోటీసులు ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.