ఎడవల్లి సిండికేట్ బ్యాంకు మేనేజర్ ఘరానా మోసం .. కంచే చేను మేసిన వైనం
సిండికేట్ బ్యాంకులో అధికారులు నకిలీ పాసుపుస్తకాలు.. ఏజెంట్లతో కలిసి బ్యాంకులో ఘరానా మోసానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచే చేను మేసిన చందంగా బ్యాంకు ఇచ్చే రుణాలకు బోగస్ పత్రాలు జత చేసి రుణాలు అప్పనంగా కాజేశారు సదరు బ్యాంకు మేనేజర్ .కోటి రూపాయలకు పైగా ఫ్రాడ్ చేసిన మేనేజర్ పని చేసిన బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టారు.
ముచ్చటగా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నిత్య పెళ్ళికొడుకీ ఉపాధ్యాయుడు
నకిలీ పాసుపుస్తకాలు.. ఏజెంట్లతో కలిసి బ్యాంకు సొమ్ము దోచేసిన మేనేజర్
డ్వాక్రా మహిళలకు రుణాలిస్తున్న పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఆ డబ్బు కాజేశారు. ఆ తర్వాత రుణాల రికవరీకి సదరు నకిలీ పత్రాల ఆధారంగా ప్రయత్నం చేసిన భ్యాంకు అధికారులు బ్యాంకులో జరిగిన దందా తెలిసి అవాక్కయ్యారు. ఇక ఏ మాత్రం రుణాలతో సంబంధం లేనిబాధితులు, మహిళలు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ఎదుట ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండల కేంద్రంలో గల సిండికేట్ బ్యాంక్లో జరిగిన అవినీతి బాగోతం వింటే అవాక్కవ్వక తప్పదు. బ్యాంకులోని సొమ్ముకు, ఖాతాదారులకు జవాబుదారీగా, చాలా బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిన ఓ మేనేజర్ ఏకంగా బ్యాంకులోనే దర్జాగా కూర్చొని బ్యాంకుకే కన్నం వేసిన ఘటన ఎట్టకేలకు బయటపడింది.
నకిలీ పత్రాలతో రుణాలు సొమ్ము కాజేసిన మేనేజర్ .. రుణాల రికవరీలో వెలుగులోకి వచ్చిన మేనేజర్ మోసం
గతంలో మేనేజర్గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ పాసుపుస్తకాలతో, ఏజెంట్లతో కుమ్మకై అవినీతికి పాల్పడినట్లు ఖాతాదారులు ఆరోపించారు. పంట రుణాలు, వ్యక్తిగత రుణాలు, డ్వాక్రా రుణాలలో సుమారు కోటి రూపాయల వరకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి మేనేజర్ శ్రీనివాస్ తమ బంధువు ఆర్ఎం అండతో ఈ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న వారికి ఎలాంటి పత్రాలు లేకున్నా రుణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. డ్వాక్రా రుణాల రికవరీ సందర్బంగా ఏఆర్పీ క్యాంప్కు చెందిన మహిళలు రుణాలు చెల్లించి తిరిగి తీసుకునే క్రమంలో బ్యాంక్ అధికారులు పంట రుణం బకాయి ఉందంటూ రుణం ఇవ్వడాన్ని నిలిపివేశారు. తాము ఎలాంటి పంట రుణాలు తీసుకోలేదని సదరు మహిళలు బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో బ్యాంకులో జరిగిన అక్రమాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వచ్చాయి.
బ్యాంకులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితుల డిమాండ్
ప్రస్తుత మేనేజర్ చంద్రశేఖర్ బ్యాంకులో జరిగిన అవినీతి అక్రమాలపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చాలా పెద్ద ఎత్తున బ్యాంకులో రుణాల గోల్ మాల్ జరిగిందని ఆయన అధికారులకు తెలియజేశారు. గత మేనేజర్ నిర్వాకం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు ఖాతాదారులు అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. సదరు మేనేజర్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.