బస్సుల బంద్ కారణంగా బడి పిల్లలకు బంగారంలాంటి వార్త చెప్పిన బాస్..!!
హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి కార్మికుల సమ్మె స్కూళ్లు, కాలేజీల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. బస్సుల బంద్ కారణంగా ఈనెల 14 న పునఃప్రారంభం కావాల్సిన విద్యాసంస్థలు 5రోజులు ఆలస్యంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 19 నుండి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె లో చాలా మంది డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొనడం వల్ల చాలా వరకు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దాదాపు 50వేల మంది ఆర్టీసి ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతున్నారు. దీంతో ప్రయివేటు డ్రైవర్లను తీసుకుని తాత్కాలికంగా కొన్ని బస్సులను ప్రభుత్వం రోడ్డెక్కించే పని చేసింది.
పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్లను, కాలేజీ బస్సులను నడిపై డ్రైవర్లను ప్రభుతం ఆర్టీసి బస్సులను నేడిపేందుకు ఉపయోగించుకుంటోంది. విద్యాసంస్థలు ప్రారంభమైతే ఈ డ్రైవర్లు కూడా తిరిగి వెనక్కి వెళ్లి పోతారు కాబట్టి దసరా పండుగ సందర్బంగా విద్యా సంస్దలకు ఇచ్చిన సెలవులను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ ఇందుకు సంబంధించి ఓ ప్రకటన చేసారు.
తెలంగాణలో ఆర్టీసి సమ్మె కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఆర్టీసీ సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ అధికారులు సునిల్ శర్మ, నర్సింగ్ రావు, సందీప్ సుల్తానియా, ట్రాన్స్ పోర్టు జాయింట్ కమిషనర్లు పాండురంగ నాయక్, సి.రమేశ్, మమతా ప్రసాద్, డిటిసిలు ప్రవీణ్ రావు, పాపారావు, ఆర్టీసీ ఇ.డి.లు టివి రావు, యాదగిరి, వినోద్, వెంకటేశ్వర్లు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. 'ఆర్టీసీలో వందకు వందశాతం బస్సులను పునరుద్ధరించాలని, దీనికోసం అసవరమైన సిబ్బందిని వెంటనే సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేసారు.
రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలని, బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారిని పనిలోకి తీసుకోవాలని, అధికారులు రేయింబవళ్లు పనిచేసి, మూడు రోజుల్లో వందకు వంద శాతం బస్సులు నడిచేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశించారు.