36గంటలు గడిచాయి.. ఇంకా బోరు బావిలోనే చిన్నారి: క్షణ క్షణం ఉత్కంఠ..
నిన్నటిదాకా సింగరేణి, ఎన్టీఆర్ఎఫ్ నిపుణులు సహాయం తీసుకున్న అధికారులు.. ఇప్పుడు ఓఎన్జీసీ నిపుణుల్ని సైతం రంగంలోకి దించుతున్నారు.
రంగారెడ్డి: చేయాల్సినన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎక్కడెక్కడి నుంచో అత్యాధునిక మెషినరీ సైతం తెప్పిస్తున్నారు. 36గంటలుగా ఆ పాపను కాపాడటం కోసం విశ్వప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
పలు రంగాల నిపుణులు, రెస్క్యూమ్ టీమ్స్ నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉన్నాయి. అయినా పాపను వెలికితీయడానికి ఇంకెంత సమయం పడుతుందనేది కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో ఇరుక్కుపోయిన పాప కోసం ఇప్పుడు రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. నిన్నటిదాకా సింగరేణి, ఎన్టీఆర్ఎఫ్ నిపుణులు సహాయం తీసుకున్న అధికారులు.. ఇప్పుడు ఓఎన్జీసీ నిపుణుల్ని సైతం రంగంలోకి దించుతున్నారు.
24 గంటలుగా బోరుబావిలోనె బాలిక,మరింత లోతుల్లోకి పాప
కాగా, మాటలు కూడా సరిగా రాని ఆ చిన్నారికి ఎలాంటి అపాయం జరగవద్దని అంతా భగవంతున్ని వేడుకుంటున్నారు. ఓవైపు చిన్నారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తుండగా.. మరోవైపు మంత్రి మహేందర్ రెడ్డి ఘటనాస్థలంలోనే ఉండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
తొలుత 40 అడుగుల అగాధంలోకి జారిపోయిందని గుర్తించి నిపుణులు వెలికి తీసే ప్రయత్నంలో 230 అడుగుల లోతుకు జారిపోయిన సంగతి తెలిసిందే.
సైబరాబాద్ పరిధిలోని 4 ఠాణాల పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. గురువారం రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం వరకు అధికారులతోపాటు మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు.
రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో పాటు ట్రాన్స్ కో, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, 108 సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారులు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.