8 మంది అరెస్ట్: సహజీవనం, రెండో పెళ్లే ఆ క్రూర హత్యకు దారితీశాయి
హైదరాబాద్: ఇటీవల అంబర్ పేటలో జరిగిన పండ్ల వ్యాపారి మహ్మాద్ ఇస్మాయిల్ హత్య కేసును అంబర్ పేట పోలీసులు ఛేదించారు. కుటుంబ తగాదాల వల్లే మృతుడి ఇస్మాయిల్కు మామ వరుస అయ్యే సయ్యద్ షఫిల్లా అలియాస్ షఫీ ఓ కథనం ప్రకారం తనకు తెలిసిన స్నేహితులతో కలసి అంబర్ పేటలో దారుణంగా హత్య చేశాడు.
అనంతరం శవాన్ని కారు డిక్కీలో వేసుకుని ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు గాను మహబూబ్ నగర్ జిల్లాలోని తాటిపత్తి గ్రామంలో పెట్రోల్ పోసి కాల్చివేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ వి. రవీందర్ మీడియాకు వివరించారు.
గోల్నాక ఖాద్రీబాగ్లో ఉండే ఎండీ ఇస్మాయిల్ (37) పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి బాగ్ అంబర్ పేట్లో నివాసముండే సయ్యద్ షఫీ (38) స్నేహితుడు. షఫీ.. తన భార్యకు కుటుంబ సభ్యులకు తెలియకుండా గోల్నాక ఆశోక్ నగర్లో ఉంటున్న ఫరీదాబేగం (43)తో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు.
ఈమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్ని విభేదాల కారణంగా ఆమె భర్తను వదిలివేసింది. ఈమ రెండో కూతురు సమీరాబేగం (25)ను 2012లో ఇస్మాయిల్కు ఇచ్చి షఫీ దగ్గరుండి పెళ్లి జరిపించాడు. సమీరాకు కూడా ఇదివరకే పెళ్లి కాగా అతనితో విడాకులు తీసుకుంది.
ఈ విషయాన్ని దాచి రెండో పెళ్లి చేశారని, దీంతో పాటు పాతబస్తీకి చెందిన తన మాజీ భర్తతో తరచూ ఫోన్లో మాట్లాడుతోందని గుర్తించిన ఇస్మాయిల్ తన భార్య, అత్తలతోపాటు వరసకు మామ అయ్యే షఫీల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
షఫీ తన రెండో భార్య షరీదాతో పాటు సమీనాతో కలసి ఇస్మాయిల్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. ఈ నెల 13న రాత్రి మాట్లాడాదామని ఓ మధ్యవర్తితో ఇస్మాయిల్కు ఫోన్ చేయించారు. ఇస్మాయిల్ రాగానే అక్కడే కారులో వేచిచూస్తున్న షఫీతో పాటు రాజేంద్రనగర్కు చెందిన షేక్ హమీద్ పాషా (39), మహ్మద్ ఆరీఫ్ (32), సయ్యద్ అబీద్ (27), సయ్యద్ మగ్దామ్ (26), విద్యానగర్కు చెందిన మహ్మాద్ జాయిద్ అహ్మాద్ (30)తో కలిసి ఇస్మాయిల్ను కారు ఎక్కించి కత్తితో పొడిచి హత్య చేశారు.
ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహాన్ని అదే రోజు రాత్రి మహబూబ్ నగర్ జిల్లా భూత్పార్ మండలం తాటిపర్తి గ్రామ శివారులోని కనికళ బావివాగు వరకు తరలించి పెట్రోలు పోసి దహనం చేశారు. అయితే రాత్రి పూట కావడంతో మృతదేహం సగం వరకే కాలిపోయింది.
చీకట్లో ఈ విషయాన్న సరిగా చూసుకోని షఫీ అతని స్నేహితులు అక్కడ నుంచి తిరిగ వచ్చేశారు. అయితే ఆ మరుసటి రోజున సగం వరకు దహనమైన వ్యక్తి మృతదేహాన్ని ఈ నెల 14వ తేదీన అక్కడి పోలీసులు గుర్తించారు.
దీంతో ప్రధాన నిందితుడు సయ్యద్ షఫీ, హత్యకు సహకరించిన మృతుడు అత్త ఫరీదా, భార్య సమీనాతో పాటు మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఓ కత్తి మూడు సెల్ ఫోన్లు, హత్యకు ఊపయోగించిన వ్యాగనార్ కారును పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.