శివకుమార్ ఇష్యూ: జగన్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు, ఏం జరిగిందంటే?
హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ వ్యవస్థాపకులు శివకుమార్ సస్పెన్షన్ విషయంలో ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంంధించి మార్చి 11వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ స్థాపించారు. ఆ తర్వాత ఈ పార్టీని జగన్కు ఇచ్చారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు వైసీపీ మద్దతివ్వడాన్ని వ్యవస్థాపకులు అయిన శివకుమార్ వ్యతిరేకించారు. జగన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
జగన్ ఆగ్రహం.. పార్టీ నుంచి శివకుమార్ సస్పెన్షన్
అదే సమయంలో తెలంగాణ ఎన్నికల సమయంలో తెరాస అధినేత కేసీఆర్.. వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైయస్ దుర్మార్గుడు అన్నారు. దీంతో తెరాసకు ఓటు వేయవద్దని శివకుమార్ పిలుపునిచ్చారు. వైయస్ మరణించే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అయితే ఇదంతా తనకు తెలియకుండా జరిగిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి, శివకుమార్ను శాశ్వతంగా బహిష్కరిస్తూ ప్రకటన జారీ చేశారు.
సస్పెన్షన్పై ఈసీకి శివకుమార్
తనను వైయస్ జగన్.. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై శివకుమార్ను తీవ్రంగా స్పందించారు. అసలు సస్పెండ్ చేసే అధికారం జగన్కు లేదని, పార్టీ తనదేనని, వ్యవస్థాపక నియమ నిబంధనలను జగన్ పక్కన పెట్టారని శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీని తిరిగి తనకు స్వాధీన చేయాలని కోరారు. అందుకు అవసరమైన బలనిరూపణకు తాను సిద్ధమన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ నోటీసులు జారీ చేసింది.
పార్టీని స్థాపించి జగన్కు ఇచ్చిన శివకుమార్
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైయస్సార్ కాంగ్రెస్)ని కొలిశెట్టి శివకుమార్ 2009లో స్థాపించారు. ఆయన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి పెద్ద అభిమాని. దీంతో ఆయన మరణానంతరం తన అభిమాన రాజకీయ నాయకుడి పేరుపై పార్టీని స్థాపించారు. ఆ తర్వాత వైయస్ పైన ఉన్న అభిమానంతో పార్టీని జగన్కు ఇచ్చారు. ఆ తరువాత జగన్ పార్టీ అధ్యక్షుడిగా, విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. శివకుమార్ వైసీపీలో క్రియాశీలక కార్యకర్తగా కొనసాగారు.