తెలంగాణలో త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు!: ; ప్రభుత్వానికి ఈసీ లేఖ
హైదరాబాద్: తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణఫై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అభిప్రాయాన్ని కోరింది. ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగియనుంది.
ఎమ్మెల్సీలైన గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహమ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం పూర్తయిన వారిలో ఉన్నారు. సాధారణంగా గడువు ముగిసే సమయానికి ముందే ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తుంది. కానీ, కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో అప్పట్లో ఎన్నికలు నిర్వహించేది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని తెలిపింది.
ఈ క్రమంలో జూన్ 3 నుంచి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. కరోనావైరస్ వ్యాప్తి ఇప్పుడు క్రమంగా తగ్గుతుండటం, రాష్ట్రంలో అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ విషయమై ఈసీ ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందినట్లు తెలిసింది.
Recommended Video
రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం తెలపాలని కోరినట్లు సమాచారం. ఇక ఈసీ లేఖపై తెలంగాన ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఎన్నికల నిర్వహణకు ఓకే అంటే.. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు. దీనిపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది.