సాక్ష్యాధారాలతో టీడీపీ ఎంపీ అభ్యర్థి సొమ్ము పట్టివేత
హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు, జయభేరి గ్రూపు సంస్థల ఛైర్మన్ మాగంటి మురళీమోహన్ కు చెందిన రెండు కోట్ల రూపాయల నగదును సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మొత్తానికి సంబంధించిన ఎలాంటి రశీదులు, పత్రాలు లేకుండా రాజమండ్రికి తరలిస్తుండగా.. పోలీసులు ఈ నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైటెక్ జయభేరి గ్రూప్ సంస్థల్లో ఒకటైన జయభేరి ప్రాపర్టీస్ ఉద్యోగులు నిమ్మలూరి శ్రీహరి, ఆరుతి పండరి సిటీ మెట్రో స్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్నతనిఖీల సందర్భంగా పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.
సినిమా చూడని న్యాయమూర్తులు! లక్ష్మీస్ ఎన్టీఆర్.. మరో వాయిదా! అక్కడ మాత్రం శాశ్వత నిషేధం
ఈ నగదుకు సంబంధించిన వివరాలపై సరైన సమాధానం చెప్పకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. తాము జయభేరి ప్రాపర్టీస్ ఉద్యోగులమని, రాజమండ్రికి డబ్బులు తరలిస్తున్న నిందితులు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.
రశీదు లేకపోతే.. సీజ్
ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున.. డబ్బును పెద్ద మొత్తంలో ఎవరు తీసుకెళ్లినా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటారు. సరైన వివరణ ఇవ్వడంతో పాటు ఆ డబ్బుకు సంబంధించిన రశీదు గానీ, ఇతర పత్రాలను పోలీసులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ రెండు కోట్ల మొత్తాన్ని రాజమండ్రికి తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. దీనితో జయభేరి ప్రాపర్టీస్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మాగంటి రూప కోసమేనా?
మురళీ మోహన్ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి లోక్ సభకు ప్రాతినథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయట్లేదు. తన కోడలు మాగంటి రూపను టీడీపీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ.. మురళీమోహన్ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన కోడలి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం అవసరమైన నగదు మొత్తాన్ని హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తమ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి తరలిస్తున్న సమయంలో.. అది పోలీసుల చేతికి చిక్కింది.
ఒక్కరోజే రూ.4 కోట్లు స్వాధీనం
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు నిర్వహిస్తోన్న విస్తృత తనిఖీల సందర్భంగా ఇప్పటికే పోలీసులు సుమారు 50 కోట్ల రూపాయలను నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బుదవారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల సందర్భంగా లెక్క తేలని నాలుగు కోట్ల రూపాయల మొత్తాన్ని వారు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు నుంచి పోలీసులు 48 లక్షల రూపాయలను సీజ్ చేశారు.
హయత్ నగర్ నుంచి చౌటుప్పల్ వైపు వెళ్తోన్న ఈ కారు నుంచి నగదుతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెం చౌరస్తాలో కారులో తరలిస్తున్న నాలుగు లక్షల రూపాయలు, హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.41 లక్షల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఆయా ఘటనల్లో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. గోషామహల్ వద్ద 26 లక్షల రూపాయలు, రామ్ గోపాల్ పేట్ వద్ద 15 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గోదావరిఖనిలో ఆర్టీసీ బస్సులో 32 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాభాద్ లో ఓ వ్యాపారి నుంచి 29.02 లక్షల రూపాయలు, మంచిర్యాలకు చెందిన రవీందర్ నుంచి 98 వేల రూపాయలు, వెన్నంపల్లి తిరుపతి అనే వ్యక్తికి చెందిన కారులో రెండు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో పోస్టల్ డిపార్ట్మెంట్ కారులో రూ.15 లక్షలు పట్టుబడింది. ఈ మొత్తం ప్రభుత్వానిదా? కాదా? అనే విషయం తేలాల్సి ఉంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 30 లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు.