టీచర్లకు పరీక్ష కాలం.. ఆ రెండు రోజులు కీలకం
హైదరాబాద్ : ఎన్నికలైనా, ప్రభుత్వ కార్యక్రమాలైనా ఠక్కున గుర్తొచ్చేది టీచర్లే. ఇటు స్కూళ్లల్లో పాఠాలు చెబుతూనే అటు అవసరమైనప్పుడల్లా ప్రభుత్వానికి సహకరించాల్సి ఉంటుంది. ఇక ఎన్నికల వేళ టీచర్లకు డ్యూటీలు తప్పవు. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీచర్లకు మరో ఇబ్బంది ఎదురుకానుంది. జనవరి 26, రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి పరిస్థితులు వచ్చాయో.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి మరోసారి తారసపడనుంది.
ఎన్నికల డ్యూటీల తంటా
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనవరి 25వ తేదీన విధులు నిర్వర్తించిన టీచర్లు ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకున్న సందర్భం. అలాంటిది మర్నాడు రిపబ్లిక్ డే కావడంతో ఉదయం 6 గంటల వరకే స్కూలుకు తప్పనిసరి హాజరుకావాల్సిన పరిస్థితి. అలా ఉరుకులు పరుగులు పెట్టక తప్పలేదు. సరిగ్గా అలాంటి సిట్యూవేషన్ మరోసారి రానుంది.
పరీక్షలంటే భయం..! వత్తిడితో మరణాలు..!
టీచర్లకే పరీక్ష.. ఉరుకులు పరుగులు
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు విధులు నిర్వర్తించే టీచర్లు మర్నాడు 12వ తేదీ ఉదయం 7 గంటల 45 నిమిషాల వరకు స్కూళ్లకు చేరుకోవాలి. ఈ అకాడమిక్ ఇయర్ కు సంబంధించి అదే రోజు చివరి పనిదినం కావడంతో తప్పనిసరి హాజరుకావాల్సిందే.
ఒకవేళ వీలుగాని పరిస్థితుల్లో ఆ రోజు స్కూలుకు డుమ్మా కొడితే సమ్మర్ హాలిడేస్ కు సంబంధించిన జీతాల్లో ఆలస్యం తప్పదు. వేసవి సెలవులు పూర్తయి స్కూళ్లు తిరిగి తెరిచిన అనంతరం.. అంటే జూన్ 1వ తేదీ తర్వాతే వేతనాలు రానున్నాయి. ఒకవేళ అటు ఏప్రిల్ 12వ తేదీన స్కూలుకు వెళ్లక.. ఇటు జూన్ 1న రాకపోతే అంతే సంగతి. వేసవి సెలవుల జీతం మరచిపోవాల్సిందే. ఆ రెండు రోజులు అంత ఎఫెక్ట్ మరి. స్కూలుకు దూరంగా.. ఏప్రిల్ 11న ఎన్నికల డ్యూటీ ఎక్కడో పడితే మాత్రం టీచర్లకు కష్టాలు తప్పవు.
డుమ్మా కొడితే అంతే..!
ఎన్నికలేమో గానీ టీచర్లకు క్లిష్ల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ రెండు రోజులు కీలకంగా మారనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీ ఎన్నికల డ్యూటీ కారణంగా ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుతారు. మర్నాడు ఉదయం 7 గంటల 45 నిమిషాల వరకే స్కూళ్లో ఉండాలంటే కొంచెం కష్టమే. అటు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే రోజు జూన్ 1వ తేదీన కూడా కచ్చితంగా హాజరుకావాల్సిందే.
ఒకవేళ ఈ రెండు రోజులు అనుకోని పరిస్థితుల్లో డుమ్మా కొడితే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే. ఆ రెండు రోజులకు లీవ్ మంజూరు చేయించుకుంటే ఒకే. జీతాలు చెల్లిస్తారు. లేదంటే సమ్మర్ వేతనంలో కోత తప్పదు. ఇక సెలవుల కోటా ఖాళీ అయిన టీచర్లు.. ఆ రెండు రోజులు గైర్హాజరయితే 49 రోజుల జీతం చేతులారా పొగొట్టుకున్నట్లే. ఒకవేళ ఏప్రిల్ 11న లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లు 12వ తేదీన డుమ్మా కొడితే.. దాన్ని జర్నీ పీరియడ్ గా పరిగణించేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే కాస్తా ఉపశమనం లభించినట్లు. లేదంటే అంతే సంగతి.