ఏడోసారి జీవన్ రెడ్డికి విరామం, గెలిపించిన కవిత: సీనియర్లకు కేసీఆర్ షాక్, ఓటమి దిశగా సుహాసిని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 90 చోట్ల తెరాస, 21 చోట్ల మహాకూటమి, బీజేపీ 3చోట్ల, మజ్లిస్ 5 చోట్ల, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. రేవంత్ రెడ్డి, జానా రెడ్డి, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ వంటి నేతలు ఓడిపోయారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి 12వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఓడిపోయారు. కేసీఆర్.. వంటేరు ప్రతాప్ రెడ్డి పైన దాదాపు 20వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి కంటే తెరాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి దాదాపు 4వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
జీవన్ రెడ్డి ఓటమి
జగిత్యాలలో కాంగ్రెస్ సీనియరగ్ నేత జీవన్ రెడ్డి ఘోర పరాజయం పొందారు. తెరాస అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు. జీవన్ రెడ్డి ఇక్కడి నుంచి ఆరుసార్లు గెలిచారు. ఇప్పుడు సంజయ్ చేతిలో ఓడిపోయారు. హోరాహోరీ పోరులో జీవన్ రెడ్డిపై సంజయ్ గెలిచారు. గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. తెరాస నుంచి సంజయ్ కుమార్, టీడీపీ నుంచి ఎల్ రమణ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేవలం 7,828 ఓట్ల తేడాతో సంజయ్పై జీవన్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు ప్రజాకూటమిలో భాగంగా ఎల్ రమణ పోటీ చేయలేదు. జీవన్ రెడ్డికి మద్దతిచ్చారు. దీంతో జీవన్ గెలుపు ఖాయమని భావించారు. కానీ ఓడిపోయారు.
గెలిపించిన కవిత
జగిత్యాలలో తెరాస అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం కోసం ఎంపీ కవిత ఎంతో శ్రమించారు. నియోజకవర్గంలో పలువురు తెరాస నాయకులు అసంతృప్తితో ఉన్నారు. వారితో మాట్లాడి పార్టీలో కొనసాగేలా చేశారు. పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకులను ఎప్పటికి అప్పుడు సమన్వయపరుస్తూ తాను ఉన్నానని భరోసా కల్పించే ప్రయత్నాలు చేశారు. జీవన్ రెడ్డి 1983లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989, 1996 ఉప ఎన్నికల్లో గెలిచారు. అనంతరం 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డిల హయాంలో మంత్రిగా పని చేశారు. ఆయన గెలుస్తారనుకున్నారు. కానీ అనూహ్యంగా ఓడిపోయారు.
అక్బరుద్దీన్ వరుసగా ఐదోసారి గెలుపు
తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం చాంద్రాయణగుట్టది వెల్లడైంది. ఇక్కడి నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఆయన గెలిచారు. ఈ విజయంతో ఆయన వరుసగా ఐదోసారి విజయం సాధించారు.
సుహాసిని గెలుపు
119 నియోజకవర్గాలకుగాను టీఆర్ఎస్ 90కి పైగా స్థానాల్లో గెలిచింది. మహాకూటమి 17 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ముఖ్యనేతలు జానారెడ్డి, రేవంత్ రెడ్డి దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, షబ్బీర్ అలీ, కొండా సురేఖ తదితరులు వెనుకంజలో ఉన్నారు. కూకట్పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణా రావు ముందంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి కృష్ణారావు దాదాపు 20వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
రికార్డ్ దిశగా హరీష్ రావు
సిద్దిపేట తెరాస అభ్యర్థి హరీష్ రావు భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నారు. ఆయన తన సమీప అభ్యర్థి నరోత్తమ్ రెడ్డి దాదాపు 90వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఉన్నారు. కేటీఆర్ 52వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు. కేసీఆర్ దాదాపు 27 వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు.