మామూలు షాక్ కాదు... ఆ ఇంటి యజమానికి ఎంత విద్యుత్ బిల్లు వేశారంటే...?
తెలంగాణలో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగాయంటూ ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు సైతం విద్యుత్ బిల్లుల పెంపుపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి. అసలే లాక్ డౌన్ కష్టాలతో ఉద్యోగ,ఉపాధి కోల్పోయి ఉన్నవారిపై విద్యుత్ బిల్లుల భారం గుదిబండలా మారిందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
తాజాగా హైదరాబాద్ లాలాపేటలోని ఓ ఇంటి యజమానికి ఏకంగా రూ.25,11,467 విద్యుత్ బిల్లు వచ్చింది. మార్చి 6 నుంచి జూలై 6 వరకు 3,45,007 యూనిట్లకు ఇంత బిల్లు వేశారు. లాక్ డౌన్ కారణంగా 3 నెలల బిల్లు ఒకేసారి వేశారు. దీంతో ఆ బిల్లును చూసి షాక్ తిన్న కృష్ణమూర్తి అనే ఆ యజమాని అధికారుల వద్దకు పరిగెత్తాడు. బిల్లును పరిశీలించిన అధికారులు... మీటర్లో లోపం వల్లే ఇంత బిల్లు వచ్చిందని తెలిపారు. అనంతరం ఇంటికి కొత్త మీటరును అమర్చారు. పాత బిల్లును సవరించి రూ.2095 వసూలు చేశారు.
Recommended Video
కాగా,లాక్డౌన్ కారణంగా పేద కుటుంబాలు,ఎంస్ఎంఈలు పూర్తిగా నష్టపోయాయని,ఆ బిల్లులను ప్రభుత్వమే భరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పీరియడ్లో చాలామందికి రెట్టింపు కంటే ఎక్కువ బిల్లులు వచ్చాయని... ప్రభుత్వ ఆ బిల్లులను మాఫీ చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సోమవారం(జూలై 7) చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.