విషాదం: తీవ్ర అనారోగ్యంతో జమున మృతి
హైదరాబాద్లోని జంతు ప్రేమికులకు ఇది విషాదకరమైన వార్త. కొన్నేళ్లుగా నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఇటు జంతు ప్రేమికులను, అటు పర్యాటకులకు కనువిందు చేసిన జమున అనే ఏనుగు మృతి చెందింది. 44 ఏళ్ల జమున గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ ఏడాది మార్చి 14న జమున కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఇక అప్పటి నుంచి జూ అధికారుల పర్యవేక్షణలో ఉంది. గాయాలపాలవడంతో తీవ్ర నొప్పితో అల్లాడిన జమున, రాత్రివేళల్లో నిద్రపోయేది కాదని జూ అధికారులు వెల్లడించారు. జూ కన్సల్టెంట్ డాక్టర్ నవీన్ కుమార్ జమున అనే ఈ ఏనుగుకు చికిత్స అందిస్తున్నారు.
జమున ఆరోగ్యాన్ని పర్యవేక్షించి తగిన చికిత్స అందించేందుకు కోయంబత్తూర్ నుంచి డాక్టర్ మనోహరన్, కేరళకు చెందిన ఏనుగుల ఆరోగ్య నిపుణులు డాక్టర్ జయకుమార్, వెటరనరీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మజలు హైదరాబాద్ జూకు వచ్చారు. కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జమునకు సరైన మోతాదులో యాంటీ బైటిక్స్ ఇచ్చినట్లు వీరు తెలిపారు. బుధవారం కుంటుకుంటూ వెళ్లిన జమునా ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిందని అధికారులు తెలిపారు. జమున గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిందని వైద్యులు పోస్ట్మార్టం అనంతరం వెల్లడించారు.
ఇదిలా ఉంటే జమున మృతితో జంతు ప్రేమికులు షాక్కు గురయ్యారు. జమునతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు జూ సిబ్బంది.