రోహిత్ సూసైడ్ నోట్లో 11 లైన్లు కొట్టేశారు: ఏముంది?
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) విద్యార్థి వేముల రోహిత్ సూసైడ్ నోట్లో 11 లైన్లు కొట్టేసి ఉన్నాయి. కొట్టేసిన లైన్లలో ఏముందో తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులు ఆ నోట్ను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపించారు.
ఆ లైన్లలో ఏముందో తెలిస్తే రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తెలిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. అది 11 లైన్లతో కూడిన పేరాగ్రాఫ్. రోహిత్ ఆ లైన్లను ఎందుకు కొట్టేశాడనేది తెలియడం లేదు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని చెప్పిన రోహిత్ ఆ లైన్లలో ఏం రాశాడనేది తెలిస్తే అసలు విషయం బయటకు వస్తుందని అనుకుంటున్నారు.
తన మరణానికి ఫలానా వ్యక్తి గానీ ఫలానా గ్రూప్ గానీ కారణమంటూ రోహిత్ సూసైడ్ నోట్లో ఎక్కడా రాయలేదు. అయితే, కొట్టేసిన పేరాగ్రాఫ్లోని విషయాలను కూడా రాబట్టడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ లైన్లను రోహిత్ స్వయంగా తానే కొట్టేసినట్లు అర్థమవుతోంది. కొట్టేసిన లైన్ల వద్ద అతను కౌంటర్ సైన్ కూడా చేశాడు. తానే వాటిని కొట్టేశానని రాసి సంతకం చేశాడు.
రోహిత్ చేతిరాతను పోల్చుకోవడానికి కూడా ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ పరీక్షలు అవసరమని భావిస్తున్నారు. కొట్టేసిన లైన్లను నిపుణులు రాబట్టగలరని, దానివల్ల అతని ఆత్మహత్యకు కచ్చితమైన కారణం తెలియవచ్చునని అంటున్నారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం బహిష్కృత పరిశోధక విద్యార్థి దొంత ప్రశాంత్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయపై, విసీ అప్పారావుపై, బిజెపి ఎమ్మెల్సీ చింతల రామచంద్రారావు, ఎబివిపి కార్యకర్తలు సుశీల్ కుమార్, కృష్ణచైతన్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా దత్తాత్రేయ మానవ వనరుల అభివృద్ధి శాఖకు రాసిన లేఖను కూడా పోలీసులు పరిశీలించనున్నారు. తద్వారా అదేమైనా రోహిత్ ఆత్మహత్యకు కారణమైందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తున్నారు.
దళిత విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరడానికి సుశీల్ కుమార్, కృష్ణ చైతన్య మానవ వనరుల అభివృద్ధి శాఖను సంప్రదించారా, లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐదుగురు విద్యార్థులను బహిష్కరించడానికి వీసీ అప్పారావు అనుసరించిన విధానాన్ని కూడా పరిశీలించనున్నారు.
రోహిత్ కుటుంబం గురించి తెలుసుకోవడానికి సైబరాబాద్ పోలీసులు రోహిత్ స్వస్థలమైన గుంటూరు జిల్లాలోని గురజాలకు కూడా వెళ్లాలని అనుకుంటున్నారు.