మోస్ట్ వాంటెడ్ తెలంగాణా వీరప్పన్ ,రెండువేల మంది నెట్వర్క్ ..మూడు రాష్ట్రాల్లో విస్తరించిన సామ్రాజ్యం
రెండు దశాబ్దాలుగా అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్ తెలంగాణా తకేలకు పోలీసుల వలలో పడ్డాడు . తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అటవీశాఖ అధికారుల కళ్లు గప్పి కలపను అక్రమంగా రవాణా చేస్తున్న తెలంగాణ వీరప్పన్ అలియాస్ ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీను కోసం పోలీసులు, అటవీఅధికారులు చాలాకాలంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు శ్రీనుతో పాటు మరో నలుగురు కలప స్మగ్లర్ల ముఠాను పట్టుకుని ఊపిరి పీల్చుకున్నారు.
20 ఏళ్ళుగా కలప దందా చేస్తున్న అంతర్రాష్ట్ర కలప స్మగ్లర్ తెలంగాణా వీరప్పన్
పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీను 1999లో కలప అక్రమ రవాణా వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. తొలుత సైకిళ్లతో రవాణా చేసే శ్రీను 20 ఏళ్ల కాలంలో ఏకంగా ఒక ముఠానే తయారుచేశాడు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని పల్లె ప్రజలకు డబ్బు ఆశ చూపి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లోని చెట్లను నరికి అక్రమ రవాణా చేసేవాడు ఎడ్ల శ్రీను . ఇక ఈ కలప అక్రమ రావాణా దందా చెయ్యటంలో శ్రీను స్టైలే వేరు .
పక్కా ప్లాన్డ్ గా దందా.. 2 వేల మంది నెట్వర్క్ తో శ్రీను సామ్రాజ్యం
కలప అక్రమ రవాణా దందా చెయ్యటానికి శ్రీను మూడు గ్యాంగ్ లను ఏర్పాటు చేశాడు. మొదటి గ్యాంగ్ చెట్లను నరుకుతుంది, రెండో గ్యాంగ్ దుంగలను ఎవరికీ కనపడని తమ స్థావరాలైన మైదాన ప్రాంతానికి తరలిస్తుంది.ఇక మూడో గ్యాంగ్ కలపను పట్టణ ప్రాంతాలకు రవాణా చేస్తుంది. అతవీప్రాంతంలోని కలపను కొట్టి చేసే ఈ కోట్ల వ్యాపారంలో ఆరితేరిన ఎడ్ల శ్రీను అలియాస్ తెలంగాణా వీరప్పన్ ఒక సామ్రాజ్యాన్నే సృష్టించారు . ఈ వ్యాపారంలో సుమారు రెండు వేల మందిని నెట్వర్క్గా తయారుచేసి శ్రీను వ్యాపారం చేస్తున్నాడు అంటే ఆశ్చర్యం కలుగక మానదు .
తెలంగాణ వీరప్పన్ ఖేల్ ఖతం..! పోలీసులకు చిక్కిన ఎడ్ల శ్రీను.. ఇక అడవులు సేఫా?
ప్రైవేట్ ఎస్కార్ట్ బృందాలతో రవాణా.. శ్రీనుకు అధికారుల, ప్రజా ప్రతినిధుల అండదండలు
అటవీప్రాంతంలో అక్రమంగా చెట్లను కొట్టి పట్టణ ప్రాంతాలకు తరలించే శ్రీను కలప రవాణాకు ప్రైవేట్ ఎస్కార్ట్ బృందాలను ఏర్పాటు చేసి దుంగలను గమ్యస్థానాలకు చేర్చేవాడు. మధ్యలో ఎవరైనా వీరిచ్చిన మామూళ్ళు తీసుకుని వదిలేస్తే సరే లేకుంటే వారిపై దాడులను సైతం చేసేవారు. ఇక క్రింది స్థాయి నుండి పై స్థాయి అధికారుల దగ్గర, ప్రజాప్రతినిధుల దగ్గర శ్రీనుకు మామూలు పలుకుబడి లేదు. శ్రీను బండి ఆపితే క్షణాల్లో వదిలెయ్యమని ప్రజాప్రతినిధుల ఫోన్స్ వస్తాయంటే నమ్మండి. శ్రీనుకు గ్రామ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేల వరకు.. అటవీశాఖ బేస్ క్యాంప్ వాచ్మెన్ నుంచి డీఎఫ్వో వరకు అందరి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. రాజకీయ ఒత్తిడితో పాటు లంచాలకు అలవాటు పడిన దాదాపు 20 మంది అటవీశాఖ అధికారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా శ్రీనుకు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
వలవేసి ఆధినిక సాంకేతికతతో పట్టుకున్న పోలీసులు .. పీడీ యాక్ట్ నమోదు
ఇతనిపై మంథని, కోటపల్లి ప్రాంతాల్లోని పోలీస్, అటవీ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలో కలప దందాతో చెలరేగిపోతున్న తెలంగాణ వీరప్పన్ను పట్టుకునేందుకు రామగుండం కమిషనరేట్ పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక మేటల కింద దాచిన కలపను డ్రోన్ కెమెరాల సాయంతో పట్టుకున్నారు.పక్కా సమాచారంతో శ్రీను గ్యాంగ్ను గోదావరి ఖనిలో అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు కుడేదల కిషన్, కోరవేని మధుకర్, రాగం శ్రీనివాస్, ఎడ్ల సంతోష్లను అదుపులోకి తీసుకుని మరో 18 మందిపై కేసులు నమోదు చేశారు.ముఠా సభ్యులు ఎక్కువగా గోదావరిఖనికి చెందిన సాయిరాం సామిల్స్, బాలాజీ సామిల్స్తో పాటు ప్రకాశం జిల్లా ఎర్రగుంట పాలెంకు చెందిన శనిగ నారాయణరెడ్డి సామిల్స్కు కలపను స్మగ్లింగ్ చేసేవారని దర్యాప్తులో తేలింది. నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు.