జనవరిలోనే పీఆర్సీ,ప్రమోషన్లు.. ఏపీ నుంచి 850 మంది వెనక్కి.. ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్...
ఉద్యోగ సంఘాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించారు. వారి సాధకబాధకాలు విన్న సీఎం... అన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఉద్యోగులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న పీఆర్సీని జనవరి నెలాఖరు లోపే ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే జనవరి నెల లోపే అన్ని రకాల ప్రమోషన్లు పూర్తి చేస్తామని,పదవి విరమణ వయసుపై కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
త్వరలోనే ఆ 850 మంది వెనక్కి...
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న 850 మంది తెలంగాణ ఉద్యోగులను కూడా త్వరలోనే వెనక్కి రప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిస్వాల్ కమిషన్ నేడు (గురువారం) సీఎస్కు నివేదిక ఇవ్వనుందని... దానిపై మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని సీఎం చెప్పారు. త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావేశమవుతానని చెప్పారు. సీఎంతో భేటీపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
సంతోషంలో ఉద్యోగ సంఘాల నేతలు...
సీఎం కేసీఆర్తో భేటీ అనంతరం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. 'పీఆర్సీపై రిపోర్ట్ ఇవాళ సీఎస్కు అందనుందని సీఎం చెప్పారు. ఏపీలో పనిచేస్తున్న 850 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పిస్తామన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగ ఖాళీలన్నీ నిరుద్యోగులతో భర్తీ చేయాలని చెప్పాము. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హెల్త్ కార్డుల పైనా స్పష్టత ఇవ్వాలని కోరాము. ప్రభుత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. జనవరిలో వేతన సవరణ ఫలాలు అందుకుంటామని ఆశిస్తున్నాం.' అని చెప్పారు.
విమర్శలకు చెక్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వరుసబెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాల భర్తీ మొదలు మహిళా కమిషన్ ఏర్పాటు,ధరణి, ఎల్ఆర్ఎస్ రద్దు,ఉద్యోగులకు పీఆర్సీ తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీఆర్సీని ప్రభుత్వం ఎన్నికల స్టంట్గా వాడుకుంటోందన్న విమర్శలు కూడా వినిపించాయి. అయితే జనవరి లోపే దానిపై నిర్ణయం ఉంటుందని సీఎం ఉద్యోగ సంఘాలకు హామీ ఇవ్వడంతో ఆ విమర్శలకు చెక్ పెట్టినట్లయింది.