దొంగల్లా మారిన అధికారులు.. ఉపాధి హామీ నిధులు హాంఫట్..!
రంగారెడ్డి : ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు దొంగల్లా మారారు. ప్రభుత్వ నిధులను పక్క దారి పట్టించి అందినకాడికి దోచుకున్నారు. ఉపాధి హామీ నిధులను అధికారులు అడ్డగోలుగా బొక్కేసిన వైనం రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. పనులు పూర్తి చేయకుండానే దొంగ బిల్లులు పెట్టుకుని లక్షలాది రూపాయలు హాంఫట్ అనిపించారు. చివరకు గ్రామస్థులు, రైతులు ఈ బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉపాధి హామీ నిధులు పక్క దారి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పక్క దారి పడుతోంది. తెలంగాణలోని పలు చోట్ల ఇప్పటికే మోసాల చిట్టా చాలా సార్లు బయటపడింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన అధికారుల అక్రమ బాగోతం విస్మయానికి గురి చేస్తోంది. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందంగా అధికారులు వ్యవహరించిన తీరు చర్చానీయాంశమైంది.
పనులు చేయించకుండానే బిల్లులు బొక్కేసిన వైనం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం వెంకిర్యాల గ్రామంలో వెలుగు చూసింది. దాదాపు 12 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులను ఎంచక్కా నొక్కేశారు. అయితే గ్రామస్థులు, రైతులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయట పడింది. అదే క్రమంలో జిల్లా కలెక్టర్కు కూడా వారు కంప్లైంట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
దసరా పండుగ వేళ.. స్పెషల్ బస్సులు, ప్రత్యేక రైళ్లు
పనులు చేయించకుండానే నిధులు బొక్కేసిన వైనం
వెంకిర్యాల గ్రామంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద రైతుల పొలాల్లో భూమి చదును చేసినట్లు రిపోర్టులు తయారు చేశారు అధికారులు. ఆ మేరకు గ్రామ ఫిల్డ్ అసిస్టెంట్, ఏపీవో తో పాటు మరికొంత మంది అధికారులు కుమ్మక్కయ్యారు. సదరు రైతుల పొలాల్లో పనులు చేయించకుండానే.. పనులు పూర్తయినట్లు మస్టర్లో వివరాలు పొందు పరిచి బిల్లులు పొందారు. రైతుల పొలాల్లో భూమి చదును చేయడంతో పాటు.. కంప చెట్లు తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ పనులు జరగలేదని గ్రామస్థులు ఆరోపిస్తుండటం గమనార్హం.
పనులు చేయించినట్లు రికార్డులు.. అక్కడేమో నో వర్క్
ఉపాధి హామీ పథకం కింద పనులు చేయించకుండానే బిల్లులు పొందిన తతంగంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. సొంత డబ్బులతో తమ పొలాల్లో పనులు చేయించుకుంటే అధికారులేమో ఇలా వ్యవహరించడం సిగ్గు చేటని ఫైర్ అవుతున్నారు. విషయం కాస్తా బయటకు పొక్కడంతో సోషల్ ఆడిట్ అధికారులకు కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కొందుర్గు పోలీసులకు రైతులు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు.
గులాబీ ఎమ్మెల్యేలకు సొంత గూటిలో విలువ లేదంటూ.. టీఆర్ఎస్ పార్టీపై కోమటిరెడ్డి గరం..!
సోషల్ ఆడిట్ అధికారులు ఏం చేస్తున్నారు?
ఉపాధి హామీ పథకంలో ఇంత పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగినప్పటికీ సోషల్ ఆడిట్ అధికారులు ఎందుకు స్పందించలేరన్నది సస్పెన్స్గా మారింది. పనులు చేయించకుండానే బిల్లుల చెల్లింపులు ఎలా జరిగాయనేది మరో కోణం. ఇప్పటికైనా ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి ఉపాధి హామీ నిధులు బొక్కేసిన సంబంధింత అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు కాజేసినప్పటికీ.. పై అధికారులు చూసీ చూడనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.