చెన్నాపురం అడవిలో ఎన్కౌంటర్: ముగ్గురు మావోయిస్టుల మృతి, పేలుడు సామాగ్రి స్వాధీనం
భద్రాత్రి కొత్తగూడెం: జిల్లాలోని చర్ల మండలంలోని చెన్నాపురం అటవీప్రాంతంలో బుధవారం ఎదరుకాల్పులు జరిగాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకుంది. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు.
ఘటనా స్థలంలో పరిశీలించగా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపారు. ఈ ప్రాంతంోల 8 ఎంఎం రైఫిల్, పేలుళ్లకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరికొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టినట్లు ఎస్పీ వివరించారు.
ఇది ఇలావుండగా, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి చొరబడేందుకు దాదాపు 300 మంది మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు అనుక్షణం అడవిని జల్లెడ పట్టే పనిలో నిమగ్నమయ్యాయి. మావో దళాలు తెలంగాణలోకి వస్తే భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో అడవిపై నిఘా పెరిగింది. అత్యాధునిక డ్రోన్ కెమెరాలను ఉపయోగించి అడవిలో మావోయిస్టుల జాడను కనిపెట్టేందుకు సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు ప్రయత్నిస్తున్నాయి.
మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడకుండా బ్రేక్ వేసేందుకు సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ నుంచి దాదాపు 50 కి.మీ.దూరం ఉన్న ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా ఇంజారం గ్రామం వద్దే మావోలను కట్టడి చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే డ్రోన్ కెమెరాలతో అక్కడి మైదానాలు, వాగులు, వంకలపై నిఘా పెంచినట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ ఉపయోగిస్తున్న డ్రోన్ కెమెరాలు భూమిపై చీమ కదలికను సైతం గుర్తించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. భూమి నుంచి కొన్ని వేల కి.మీ ఎత్తున ఎగిరే వీటిని గుర్తించడం మావోయిస్టులకు సాధ్యం కాదు.
ఈ నెల 13న దాదాపు 300 మంది మావోయిస్టుల కదలికలు సుకుమా జిల్లా కిష్టారం వద్ద సీఆర్పీఎఫ్ డ్రోన్ కెమెరాలకు చిక్కాయి. స్థానికంగా ఉన్న ఓ వాగును దాటుతుండగా కెమెరాల్లో వారి కదలికలు రికార్డయ్యాయి. సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసేందుకే భారీ స్థాయిలో మావో దళాలు అక్కడికి తరలి వెళ్లినట్లు గుర్తించారు. సుకుమా జిల్లాలోని ఇంజారం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు ద్వారా తెలంగాణలోకి చొరబడేందుకు మావోలు ప్రయత్నిస్తున్నట్లు సీఆర్పీఎఫ్ బలగాలు గుర్తించాయి. వారిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వకుండా దండకారణ్యం వైపు తరిమికొట్టాయి. అయితే మావోలు మళ్లీ వెనక్కి వచ్చే అవకాశం ఉండటంతో... వారిని సాధ్యమైనంత దూరం తరిమికొట్టేందుకు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.