యువ ఇంజనీర్ బలవన్మరణం: సూసైడ్ నోట్లో ఇలా...
ఓ యువ ఇంజనీరు అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన హృదయాలను కలిచివేస్తోంది. ఉన్నతాధికారుల వేధింపులకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
జగిత్యాల: ఓ యువ ఇంజనీరు అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన హృదయాలను కలిచివేస్తోంది. ఉన్నతాధికారుల వేధింపులకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సింగరేణి కార్మికుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు.
తండ్రిని, తల్లిని, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనాథలను చేసి శ్రీకాంత్ (30) అనే యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఎండపల్లికి చెందిన సింగరేణి విశ్రాంత కార్మికుడు దేవి పోచయ్య-శ్రీలత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు.
కూతుళ్లిద్దరికీ పెళ్లి జరిపించి కొడుకు శ్రీకాంత్(30)ను ఇంజినీరింగ్ చదివించారు. పదేళ్ల క్రితం ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామానికి వచ్చిన పోచయ్య భూమి కొనుగోలు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఎంటెక్ పూర్తి చేసిన శ్రీకాంత్ ఏడాదిన్నర క్రితం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగిన నియామకాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు.
మరో మూడు నెలల్లో...
శ్రీకాంత్ పీహెచ్డీ కూడా చేస్తున్నాడు. మరో మూడు నెలల్లో అది పూర్తయి డాక్టరేట్ పట్టా కూడా చేతికి వచ్చేది. నిర్మల్ డివిజన్ పరిధిలోని ఆసిపాబాద్ సబ్ డివిజన్లో తనిఖీ, నాణ్యత, నియంత్రణశాఖలో పోస్టింగ్ పొందాడు. మూడు నెలల కిందట శ్రీలక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. శ్రీకాంత్ ఆత్మహత్య ఆమె జీవితంలో కారు చీకటినే మిగిలించింది.
ఈఈని ఉద్యోగం నుంచి తొలగించాలి
ఏఈఈ శ్రీకాంత్ మృతికి కారకుడైన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రఘువీరారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు ముద్దం ప్రకాశ్ డిమాండ్ చేశారు. కులం పేరిట దూషిస్తూ వేధింపులకు పాల్పడిన అతనిపై 306 సెక్షన్ ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు.
వేధిస్తూ వచ్చాడు...
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శ్రీకాంత్ అధికారులు, కుటుంబ సభ్యులనుద్దేశించి లేఖ రాసి మెయిల్ చేశాడు. ‘శ్రీలక్ష్మి, అమ్మా, నాన్న, అక్కలు నన్ను క్షమించండి.. ఇలా మధ్యలో వదిలేసి మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు. నాకు ఎలాంటి కార్యక్రమాలు(దినాలు, మాసికాలు అని) చేయకండి. మా ఈఈ పెడుతున్న టార్చర్ (వేధింపుల) వల్లే చనిపోతున్నా. నేను ఏం చేసినా తప్పే అతనికి. కావాలని నన్నే టార్గెట్ (లక్ష్యం)గా చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడు' అని రాశాడు.
నన్ను క్షమించండి..
‘గురువారంనాడు కూడా అలానే ప్రవర్తించాడు. మా ఆఫీస్ వాళ్లంతా అతడితో గొడవ పడితే అతనికి ఏమీ కాదు. అతనిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరు అని అంటున్నారు. అతనితో రాజీ పడితేనే మంచిదని చెప్పేవారు. అతనితో రాజీ పడినా కూడా వదిలిపెట్టే వాడు కాదు. నన్ను ఇలా వేధింపులు పెడుతూనే ఉన్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అందరు నన్ను క్షమించండి.' అని శ్రీకాంత్ సూసైడ్ నోటులో రాశాడు.