మిస్టరీగా సౌమ్య హత్య కేసు, కక్షతో హత్య!: భర్తతో ఎలాంటి విభేదాల్లేవు
హైదరాబాద్: సౌమ్య హత్య కేసు మిస్టరీగా మారింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎర్రగడ్డ నందన్ నగర్లోని ఓ అపార్టుమెంటులో మూడు రోజుల క్రితం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఎన్నో అనుమానాలు: సౌమ్యది హత్యే?, నువ్వెల నూనె పోసి మరీ..
ఆమె ఒంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి, వంటనూనె పోసి సజీవ దహనం చేశారని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆమె భర్త నాగభూషణంతో పాటు మరికొందరిని పోలీసులు విచారించారు. కేసు దర్యాఫ్తును వేగవంతం చేశారు.
సౌమ్య హంతకుల కోసం 2 బృందాలు
సౌమ్య హత్యకు పాల్పడిన ఆగంతకులను పట్టుకునేందుకు పోలీసులు అన్ని ఆధారాలను పరిశీస్తున్నారు. టాస్క్ ఫోర్స్, సీసీఎస్, స్థానిక పోలీసులతో కలిసి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
భర్తపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు
హంతకుడు సౌమ్యను చంపడంతో పాటు ఏడాదిన్నర వయసు ఉన్న ఆమె కుమారుడిని ఇంట్లోనే బంధించి బయట గడియ పెట్టాడు. కక్షతో ఈ పని చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లభించలేదు.
ఎవరికీ అనుమానం లేదు
సౌమ్య భర్త ఆ రోజు విధుల్లో ఉన్నారు. అంతేకాకుండా దంపతుల మధ్య గతంలో విభేదాలు ఎన్నడూ లేవు. స్థానికులను విచారించినా వారు ఇదే విషయం చెప్పారు. అత్తామామలు కూడా అల్లుడిపై ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. దీంతో పోలీసులు ఇతర అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.
అర్ధరాత్రి సమయంలో సంఘటన
కాగా, ఎర్రగడ్డలో సౌమ్య తమ అపార్టుమెంటులో సజీవదహనమైన విషయం తెలిసిందే. అపార్టుమెంటులోని తమ ఫ్లాట్ 104లో సౌమ్య - నాగభూషణంలు కుమారుడితో పాటు ఉంటున్నారు. అతను ఎల్ అండ్ టీలో ఇంజినీర్గా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి అతను ఇంటి నుంచి విధుల నిమిత్తం వెళ్లిపోయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.